నైజం అంటే దిల్ రాజు.. దిల్ రాజు అంటేనే నైజం. ఇది పాత లెక్క కానీ ఇప్పుడు సీన్ మారింది. నైజం గడ్డ పైకి వరంగల్ శ్రీను అడుగు పెట్టాడు. దిల్ రాజు పై బస్తీ మే సవాల్ అంటూ దూసుకెళ్తున్నాడు. మెగా స్టార్ ఆచార్య నైజం హక్కులను దిల్ రాజుతో పోటీ పడి మరీ రికార్డు స్థాయిలో రూ. 42 కోట్లకు దక్కించుకున్నాడు. ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా.. డిజాస్టార్ వైపు అడుగులు వేస్తున్నా.. వరంగల్ శ్రీను తగ్గేదే లా.. అంటూ మరో ప్రయోగం చేయడానికి సిద్ధం అవుతున్నాడు.
మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, కరోణ్ జోహర్, అపూర్వ మేహాత, యష్ జోహర్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ భారీ అంచనాలతో అగష్టు 25వ తేదీన రిలీజ్ కానుంది.
అయితే ఈ మూవీ నైజం తో పాటు ఆంధ్ర, సీడెడ్ హక్కులను వరంగల్ శ్రీను ఏకంగా భారీ ధరకు కొనుగోలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏకంగా రూ. 70 కోట్లపైగా ఈ సినిమా కోసం వరంగల్ శ్రీను వెచ్చించారట. అయితే ఆచార్య సినిమాతోనే భారీ నష్టాలను ఎదుర్కున్న వరంగల్ శ్రీను.. మరోసారి ఇంత భారీ మొత్తానికి హక్కులు కొనుగోలు చేయడం అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కావడం, బాలీవుడ్ భామ అనన్య పాండే, ఇంటర్నేషనల్ బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ ఈ సినిమాలో నటించిండతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఆచార్యతో వచ్చిన నష్టాన్ని లైగర్ తో పూడ్చే అవకాశాలు ఉన్నాయని సినీ క్రిటిక్ప్ అంటున్నారు.