ముంబై ఎటాక్స్లో చనిపోయిన అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్ని కృషన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘మేజర్’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి తెలియని మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఈ సినిమా విడుదలైన సమయంలో దేశవ్యాప్తంగా ఉన్ని కృష్ణన్ గురించి ఇంటర్ నెట్లో సెర్చ్ చేయడం విశేషం.
ఇదిలా ఉండగా.. ఇండియన్ పనోరమా ఆధ్వర్యంలో 53వ “ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా” గోవాలో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఐఎఫ్ఎఫ్ఐలో పలు చిత్రాలు ప్రదర్శిస్తారు. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకు IFFI లో కొన్ని చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి. తాజాగా ఇండియన్ పనోరమా జ్యూరీ ప్రదర్శించే చిత్రాల వివరాలను ప్రకటించింది. వీటిలో 25 ఫీచర్ ఫిల్మ్లు, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్లు ఉన్నాయి. ప్రదర్శించే సినిమాల్లో టాలీవుడ్ నటుడు అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ చిత్రం ఉండడం విశేషం.
మేజర్ సినిమా IFFI లో ప్రదర్శించబడుతుందనే విషయాన్ని అడవి శేష్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ చేసిన పోస్ట్లో అడవి శేష్, శశి కిరణ్ తిక్కా, సాయి మంజ్రేకర్, మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ ఇండియాని ట్యాగ్ చేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.70కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేయడం విశేషం. మేజర్ చిత్రం IFFI లో ప్రదర్శించడం పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.