తమిళ హీరో కార్తీ సాధారణంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా చేస్తుంటాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూనే ఉన్నాడు. ఎవ్వరూ ఆలోచించని కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. కార్తీ సినిమాలన్నింటిని తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా బాగానే ఇష్టపడుతుంటారు. కార్తీ నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి.
తాజాగా అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పీఎస్ మిత్రన్తో కలిసి కార్తీ హీరోగా నటించిన చిత్రం సర్దార్. ఈ చిత్రం తమిళంలో బాక్సాఫీస్ వద్ద 5 రోజుల్లోనే అసాధారణమైన వ్యాపారాన్ని సంపాదించింది. కార్తీ సరసన రాశీఖన్నా, రజిషా విజయన్ నటించిన విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ నటి లైలా కూడా ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమా తమిళనాడుతో పాటు తెలుగులో పుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
మరోవైపు సర్దార్ పార్ట్ 2 చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. సర్దార్ సీక్వెల్ ఉంటుందని, అది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని ప్రకటించడం విశేషం. సర్దార్ సినిమాలో కార్తీ కొడుకు పాత్రను రా ఏజెంట్గా చేరమని ఆఫర్ చేశాడు. అతను అంగీకరించాడు. తదుపరి మిషన్ కంబోడియాలో జరుగనుంది. సర్దార్ కోసం పని చేసిన టీమ్ సర్దార్ 2కి కూడా పని చేయనుందట. ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.