టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, అగ్ర దర్శకుడు పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో తాజాగా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా లైగర్. ఈ చిత్రంలో అనన్యపాండే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది.
విజయ్కి ఉన్న ఫ్యాన్స్ బేస్ దృష్ట్యా లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేస్తుందని ఊహించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఈ చిత్రం విడుదలైన రోజునే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ని తప్పుబడుతున్నారు నెటిజన్లు. పూరి అభిమానులు లైగర్ విషయంలో సృంతృప్తి చెందలేకపోయారనే చెప్పవచ్చు.
ప్రధానంగా హీరో విజయ్ ఎంత కష్టపడినా.. ఛార్మి ఎంత ఖర్చు పెట్టినా సినిమాలో దమ్ము లేనప్పుడు అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అంటున్నారు కొందరు నెటిజన్లు. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఏ ఒక్కరి తప్పు ఏం లేదని.. సినిమా అంటేనే టీమ్ వర్క్ కాబట్టి.. కేవలం పూరిని తప్పుబట్టడం సరైంది కాదని మరికొందరూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిన కొంతమంది డిస్ట్రీబ్యూటర్స్కి దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మిలు కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఆంధ్రకు రూ.6కోట్లు, నైజాం రూ.4.5 కోట్లు, సీడెడ్ రూ.2.25 కోట్లు, వెనక్కి ఇవ్వడానికి అంగీకరించారట. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.