35Years for Geetanjali movie : టాలీవుడ్ లో ప్రేమకహ్తా చిత్రాలు ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్ లలో సందడి చేస్తూనే ఉంటాయి. నాటి దేవదాసు నుండి, నేటి సీతారామం వరకు ఎన్నో క్లాసిక్ హిట్స్ ప్రేమ కథల నేపథ్యంలో వచ్చాయి. అందులో కొన్ని కమర్షియల్ జోనర్ లో వస్తే.. మరి కొన్ని స్వచ్ఛమైన ప్రేమకథలు గా తెరకెక్కి ప్రేక్షకులని అలరించాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ఆల్ టైం క్లాసిక్ స్టేటస్ ని పొందాయి. అలాంటి క్లాసిక్ సినిమాల్లో “గీతాంజలి” చిత్రం ఒకటి. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి సినిమా తెలుగులో ప్రేమకథా చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. ప్రణయ దృశ్యకావ్యంలా రూపొందిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నాగార్జున కథానాయకుడిగా నటించగా, టైటిల్ రోల్ లో గిరిజ నటించింది. ఈ క్లాసిక్ మూవీ రిలీజ్ అయి నేటికీ 35 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర విశేషాలను కొన్ని తెలుసుకుందాం.
ప్రేమ కథా చిత్రాల్లో కొత్త ఒరవడి..
నాగార్జున హీరోగా అప్పటికే జానకి రాముడు, మజ్ను వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించాడు. అప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నాగార్జునని ఈ సినిమాతో మణిరత్నం మరింత చేరువ చేసాడు. ముఖ్యంగా నటన పరంగా నాగార్జున ని ఎన్నో మెట్లు ఎక్కించింది ఈ సినిమా. మణిరత్నం క్లాస్ డైరెక్షన్ కి తోడు మేస్ట్రో ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ అత్యంత ప్రజాదరణ పొందాయి. 1989 లో మే 12న విడుదలైన ఈ చిత్రం మొదట్లో నెమ్మదిగా ఉందని టాక్ వచ్చినా ఆ తరవాత లాంగ్ రన్ లో అద్భుతంగా ఆడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన గిరిజ కి నటి రోహిణి చెప్పిన డబ్బింగ్ ఓ రేంజ్ లో పాపులర్ అయింది. “లేచిపోదామన్న మొనగాడా రా చూద్దాం” అంటూ హీరోయిన్ కి చెప్పిన ఆ డైలాగ్ అప్పట్లో యమా పాపులర్. ఇక ఈ సినిమాలో అన్ని పాటలు క్లాసిక్ అయ్యాయి. “ఆమని పాడవే”, `”ఓ ప్రియా ప్రియా”, “ఓ పాపా లాలీ”, “నందికొండ వాగుల్లోన”, “ఓం నమః”, “జల్లంత కవ్విత”, “జగడ జగడం… ఇలా ఇందులోని అన్ని పాటలు కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ పాటలన్నింటికీ వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించగా ఎస్పీ బాలు, జానకి, చిత్ర గాత్ర దానం చేశారు.
అవార్డులు..రివార్డులు..
ఇక గీతాంజలి (35Years for Geetanjali movie) చిత్రం మొత్తం ఊటీలో చిత్రీకరించగా, సినిమా తమిళ్, మలయాళంలో కూడా హిట్ అయింది. ఇక ఏ సినిమాలో తొలిసారిగా నాగార్జున ముద్దు సీన్ లో నటించారు. గీతాంజలి సినిమాకి ఉత్తమ చిత్రం, ఉత్తమ కథా రచయిత (మణిరత్నం), ఉత్తమ హాస్యనటుడు (వేలు), ఉత్తమ నృత్యదర్శకత్వం (సుందరం మాస్టర్), ఉత్తమ ఛాయాగ్రహణం (పీసీ శ్రీరామ్), ఉత్తమ కళాదర్శకుడు (తోట తరణి) ఇలా 7 విభాగాల్లో ‘నంది’ పురస్కారాలను అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా మణిరత్నం కి ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెటింది. అంతే కాదు ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఎంటర్టైన్మైంట్ కేటగిరిలో జాతీయ పురస్కారం సైతం సొంతం చేసుకుంది. అలాగే, హిందీనాట ‘యాద్ రఖేగీ దునియా’ పేరుతో హిందీలో కూడా రీమేక్ అయింది.