Vazhakku Movie Leaked : ప్రముఖ మాలీవుడ్ నటుడు టోవినో థామస్ , దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ మధ్య గత కొన్ని రోజులుగా వజక్కు మూవీ విషయంలో వివాదం నడుస్తోంది. తాజాగా ఆ వివాదం పీక్స్ కు చేరింది. సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వంలో వజక్కు సినిమా రూపొందింది. ఈ సినిమాలో టోవినో థామస్ ప్రధాన పాత్ర పోషించాడు. నిర్మాతగా కూడా వ్యవహరించారు. డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికంటే ముందే ఆన్లైన్లో లీక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మూవీని లీక్ చేసిన డైరెక్టర్
గతంలో సనల్ కుమార్ సినిమా విడుదల విషయంలో టోవినో థామస్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమై చాలా కాలమే గడుస్తోంది. కానీ హీరో, దర్శకుల మధ్య ఉన్న సమస్యలు సద్దుమణగకపోవడంతో విడుదల ఆలస్యమైంది. దీంతో దర్శకుడు సనల్ కుమార్ ‘వజక్కు’ సినిమాను ‘విమియో’ వీడియో ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశాడు. కొందరు దీన్ని డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. మొత్తానికి నటుడు, దర్శకుడి మధ్య గోడవతో థియేటర్లు లేక ఓటీటీలో విడుదల కావాల్సిన ‘వజక్కు’ సినిమా ఇప్పుడు ఆన్లైన్లో లీక్ అయ్యింది. దీనికి ముందు టొవినో థామస్, సనల్ కుమార్ శశిధరన్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
హీరోపై డైరెక్టర్ ఆరోపణలు
దర్శకుడి ఆరోపణల ప్రకారం హీరో టొవినో నిర్లక్ష్యం కారణంగా వజక్కు (ది వార్రల్) చిత్రం థియేటర్లలో లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదల కావడం లేదు. టోవినో స్వయంగా నిర్మించిన సినిమా థియేటర్లలో పరాజయం పాలయ్యే అవకాశం ఉన్నందున ఆయన విడుదల చేయడం లేదని డైరెక్టర్ అన్నారు.
హీరో రియాక్షన్
అయితే ఈ ఆరోపణలపై టొవినో థామస్ స్పందిస్తూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో లైవ్ వీడియో చేశాడు. వీడియోలో దర్శకుడికి బయట ఉన్న పేరు కారణంగా ఓటీటీ ప్లాట్ఫామ్లు సినిమా స్ట్రీమింగ్ను తిరస్కరిస్తున్నాయని చెప్పాడు. వజక్కు సినిమా మంచి చిత్రమని, తాను నటించిన ఏ సినిమాను కూడా చెడుగా చూడలేదని అన్నారు.
2020లోనే మూవీ కంప్లీట్
వజక్కు సినిమా షూటింగ్ 2020లో పూర్తయింది. 2021లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రంలో టోవినోతో పాటు కని కస్రుతి, సుదేవ్ నాయర్, అజీస్ నెడుమంగడ్, బైజు నెట్టో, తన్మయ సోల్ పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కేరళలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 27వ ఎడిషన్ లో ప్రదర్శించారు. 54వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్లో అనేక అవార్డులను కూడా గెలుచుకుంది.
వజక్కు స్టోరీ
విడాకులు తీసుకుంటున్న సిద్ధార్థన్ అనే న్యాయవాది కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. తరువాత ఆయన ఒక బిడ్డతో జీవిస్తున్న సింగిల్ మదర్ సతిని కలుస్తాడు. కష్ట సమయాల్లో వారు బంధాన్ని ఎలా ఏర్పరుచుకుంటారు ? అనే స్టోరీ లైన్ తో మూవీ నడుస్తుంది. కాగా మలయాళ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ ఇప్పటికే కొన్ని వివాదాలతో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు తన సొంత సినిమాను ఆన్లైన్లో లీక్ చేసి మరో వివాదం సృష్టించాడు.