Panchayat 3 : మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 3 మంగళవారం, మే 28న విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, సాన్వికా, చందన్ రాయ్ లు మళ్లీ తమ పాత్రలలో కన్పించారు. ఇక ఈ సిరీస్ కు మిక్స్డ్ రెస్పాన్స్ లభిస్తుండగా, తాజాగా ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి.
ఈ ఇద్దరు స్టార్స్ కే భారీ రెమ్యూనరేషన్
సమాచారం ప్రకారం ఈ సీజన్ లో జితేంద్ర కుమార్ అకా జీతు అత్యధిక పారితోషికం అందుకున్న నటుడు అని తెలుస్తోంది. ఈ షోలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్లలో నీనా గుప్తా రెండో స్థానంలో నిలిచారు.
ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?
అభిషేక్ త్రిపాఠి పాత్ర కోసం జితేంద్ర కుమార్ ఒక ఎపిసోడ్కు రూ.70,000 పారితోషికంగా అందుకున్నట్టు సమాచారం. మూడవ సీజన్లో ఎనిమిది ఎపిసోడ్లు ఉండగా, ఈ సీజన్లో జితేంద్ర ఒక్కరే రూ. 5,60,000 రెమ్యూనరేషన్ గా తీసుకున్నారు. మంజు దేవి పాత్రలో మళ్లీ నటించేందుకు కొత్త సీజన్ లో ఆమెకు ఒక్కో ఎపిసోడ్కు రూ. 50,000 చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో ఆమె రూ. 4,00,000 వెనకేసుకుంది.
ఈ సీజన్లో అత్యధిక పారితోషికం తీసుకునే మూడో స్టార్ రఘుబీర్ యాదవ్. ప్రధాన్ జీ అకా మంజు దేవి భర్తగా నటించిన రఘుబీర్ ఈ సీజన్లో ఒక్కో ఎపిసోడ్కు రూ. 40,000, అంటే రూ. 3,20,000 పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. కొత్త సీజన్లో వికాస్ జీగా నటించిన చందన్ రాయ్ ఒక్కో ఎపిసోడ్కు రూ.20,000 వసూలు చేశాడు. మొత్తానికి ప్రస్తుతం ఈ సీజన్ తో పాటు నటీనటుల రెమ్యూనరేషన్లు కూడా హాట్ టాపిక్ గా మారాయి.
పంచాయత్ 3 స్టోరీ..
సీజన్ 2 ముగింపు నుండి కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు బదిలీ అయిన సచివ్ జీ (జితేంద్ర కుమార్) తన CAT పరీక్షలకు సిద్ధం కావడానికి ఢిల్లీకి మకాం మార్చాడు. కానీ ఇంకా అతను ఫూలేరా గురించే ఆలోచిస్తాడు. మరోవైపు అతని స్థానంలో కొత్త పంచాయతీ కార్యదర్శిని పరిచయం చేశారు. కొత్త సీజన్ కొత్త మలుపులతో ఇంట్రెస్టింగ్ గా ఉంది.
మిక్స్డ్ రియాక్షన్
నిజానికి పంచాయత్ సీజన్ 3 గురించి ఓటీటీ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ తీరా రిలీజ్ అయ్యాక దీనికి విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా మిక్స్డ్ రియాక్షన్ వస్తోంది. మొదటి రెండు సీజన్లు ఉన్నంత ఇంట్రెస్టింగ్ గా సీజన్ 3 లేదని, సాగదీసిన ఫీలింగ్ వస్తోందని టాక్ నడుస్తోంది.
మొదటి నుంచి తన క్యారెక్టర్ని చక్కగా పోషిస్తూ వస్తున్న జితేంద్ర ఈ సారి కూడా ఏ మాత్రం తీసిపోలేదు. ప్రధాన్జీ, మంజు దేవి పాత్రల్లో రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా అద్భుతంగా నటించారు. వీరిద్దరి మధ్య గొడవలు, పోట్లాటలు చూడటం కూడా చాలా సరదాగా ఉంటుంది. నటి సాన్విక కాస్త చిరాకు తెప్పించినా రింకీ పాత్రలో బాగుంది.