Dasari Narayanarao Death Anniversary : “దర్శకరత్న దాసరి నారాయణ రావు”. తెలుగు చలన చిత్ర ఈయన పేరు తెలియని వారుండరు. దర్శకరత్న గా ఇండస్ట్రీలో చెప్పుకునే ఈయన తెలుగు దిగ్దర్శకులలో ఒకరిగా, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల పాటు దర్శకుడిగా తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్రవేసిన దాసరి, నాటి ఎన్టీ రామారావు నుండి, నేటి మంచు విష్ణు దాకా, మూడు తరాల నటులతో సినిమాలు చేసి దర్శకుడిగా తన ప్రాముఖ్యత చాటుకున్నారు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా, రచయిత గా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఇండస్ట్రీ లో ఏ చిన్న సినిమాకి కష్టం వచ్చినా ముందుండే వ్యక్తి దాసరి నారాయణరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి తలలో నాలుకలా మెదిలి, ఇండస్ట్రీ పెద్ద అనిపించుకున్న దాసరి నారాయణరావు దూరమై నేటికీ (మే 30) సరిగ్గా ఏడేళ్లయింది. ఈ సందర్బంగా లెజెండరీ దర్శకుడికి నివాళులు (Dasari Narayanarao Death Anniversary) అర్పిస్తూ, ఒక్కసారి ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవల్ని గుర్తుచేసుకుందాం.
సాంఘీక చిత్రాలలో మేటి దాసరి..
పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన దాసరి చిన్నప్పట్నుంచే నాటకాలపై, సాహిత్యంపై మక్కువతో నాటికలు రాసేవారు. క్రమంగా దర్శకుడు కావాలని మద్రాసు కి వచ్చారు. అలా దాసరి నారాయణరావు దర్శకుడిగా 1973 లో ‘తాత మనవడు’ అనే సినిమా తీశారు. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు చేయాల్సిన సబ్జెక్టుతో ఆ చిత్రాన్ని రూపొందించి, తొలి చిత్రంతోనే శభాష్ అనిపించుకున్నారు. అంతే కాదు ఫస్ట్ సినిమాకే ఎస్వీ రంగారావు లాంటి మహానటులతో పనిచేసే అదృష్టాన్ని దక్కించుకున్నారు. ఇక దాసరి నారాయణరావు ఆ రోజుల్లో అందరూ పౌరాణిక, జానపదాలతో, ఇంకా కమర్షియల్ చిత్రాలతో రాణిస్తుంటే, ఈయన మాత్రం సమాజానికి అవసరమయ్యే సాంఘీక చిత్రాలతో, సంఘం లోని అవకతవకలను ప్రశ్నిస్తూ ఆరోజుల్లోనే సినిమాలు తీయడం స్టార్ట్ చేసారు. ఇక తెలుగులో కమర్షియల్ చిత్రాలతో కె. రాఘవేంద్రరావు కొత్త పుంతలు తొక్కిస్తే, దాసరి నారాయణరావు మాత్రం సమాజానికి అవసరమయ్యే సాంఘీక చిత్రాలతోనే ఇండస్ట్రీ లో ట్రెండ్ సెట్ చేసారు. దాసరి సినిమాలు చూసే వారికి యిట్టె ఆయన దర్శకత్వ ప్రతిభ అర్ధమైపోతుంది. ఆయన సినిమాల్లో సామాన్యుడే కథానాయకుడు. వారి కష్టాలే కథలు, వాళ్ళ బాధలే కథనం. అందుకే ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి.
అత్యధిక చిత్రాలు చేసి గిన్నిస్ రికార్డు..
ఇక దాసరి నారాయణరావు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక చిత్రాలు చేసిన దర్శకుడుగా గిన్నిస్ రికార్డులకెక్కారు. దాదాపు 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించిన దాసరి, 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా కూడా పనిచేశారు. తెలుగు, తమిళం , కన్నడ భాష చిత్రాలలో నటించి, మామగారు అనే చిత్రంలో తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా నందిని కూడా పొందాడు. తెలుగుతో పాటు, తమిళ్, హిందీలో కూడా సినిమాలు తీసిన దాసరి నారాయణరావు ప్రస్తుతం ప్రేక్షకుల మధ్యలో లేకపోయిన ఆయన తీసిన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి. అయితే దాసరి పోయిన తర్వాత ఒక ఇండస్ట్రీ దిగ్దర్శకుడిగా ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరని పలువురు సెలెబ్రిటీలు అంటుంటారు.