Michael Jackson : మైఖేల్ జాక్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఇప్పుడు మన మధ్యన లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల మనసుల్లో మాత్రం చెరగని ముద్ర వేశారు. అయితే తాజాగా ఆయన కుటుంబ సభ్యులకు పెద్ద చిక్కే వచ్చి పడింది. స్వంత ట్రస్ట్ కుటుంబ సభ్యులకు కొన్నాళ్ళ పాటు డబ్బులు ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. మరి ట్రస్ట్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
ట్రస్ట్ కథ ఏంటంటే?
మైఖేల్ జాక్సన్ ఒక అమెరికన్ గాయకుడు, పాటల రచయిత, డ్యాన్సర్, పరోపకారి. ఆయనను “కింగ్ ఆఫ్ పాప్” అని కూడా పిలుస్తారు. అప్పట్లోనే ఆయన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదిరిపోయే తన మ్యూజిక్ తో డ్యాన్స్ తో ఫాలోవర్స్ ను ఊపేశారు. అయితే మైఖేల్ 2009 జూన్ లో మరణించాడు.
మైఖేల్ జాక్సన్ ముగ్గురు పిల్లలు పారిస్, ప్రిన్స్, బిగి ఉన్నారు. అలాగే అతని తల్లి, కేథరీన్ ఆ పిల్లలను చూసుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా మైఖేల్ కుటుంబ సభ్యులకు మైఖేల్ ట్రస్ట్ ఫెడరల్ ఎస్టేట్ నుండి నిధులు అందుతూ ఉన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అతని ఎస్టేట్, IRS (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్)కు మధ్య నెలకొన్న వివాదం పరిష్కరించబడే వరకు మైఖేల్ ఫ్యామిలీ ఎస్టేట్ నుంచి డబ్బు పొందకుండా బ్లాక్ చేశారు. మైఖేల్ జాక్సన్ తల్లి, పిల్లలు ఈ ట్రస్ట్ లబ్ధిదారులు.
మీడియా కథనాల ప్రకారం చట్టపరమైన పోరాటం కొనసాగినంత కాలం లబ్ధిదారులకు డబ్బు కేటాయించలేమని కార్యనిర్వాహకులు స్పష్టం చేశారు. “వాస్తవంగా శ్రీమతి జాక్సన్ తన సంరక్షణ లేదా నిర్వహణ కోసం చేసిన అభ్యర్థన ఏదీ తిరస్కరించబడలేదు” అని ప్రత్యేకంగా ట్రస్ట్ నిర్వాహకులు ఓ లేఖను విడుదల చేసినట్టు సమాచారం.
ఇదే వివాదం
IRS ఫెడరల్ ఎస్టేట్ టాక్స్ రిటర్న్ను పరిశీలించినప్పుడు లేట్ పాప్ ఐకాన్ మైఖేల్ ఎస్టేట్కు ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోట్ను జారీ చేయడంతో చట్టపరమైన వివాదం మొదలైంది. ఎస్టేట్ తన ఆస్తులను తక్కువ అంచనా వేసిందని, పన్నులు, జరిమానాలలో అదనంగా $700 మిలియన్లు బకాయిపడిందని ట్యాక్స్ అధికారులు ఆరోపించారు.
కోర్టుకెక్కిన వివాదం
2021లో ఎస్టేట్ ఈ ఆరోపణలను కోర్టులో సవాలు చేసింది. తరువాత ఎస్టేట్ మైజాక్ (సోనీ మ్యూజిక్ యాజమాన్యంలోని మైఖేల్ జాక్సన్ మ్యూజిక్ కేటలాగ్) కోర్టు విలువకు సంబంధించి పునఃపరిశీలన కోసం ఒక పిటిషన్ను దాఖలు చేసింది. అది ఇప్పటికీ పెండింగ్లో ఉంది. పన్ను ప్రయోజనాల కోసం ఎస్టేట్ విలువ నిర్ణయించబడలేదు. ఇది జరిగిన తర్వాత తుది తీర్పును నమోదు చేయడానికి ముందు IRS ఎస్టేట్ తగ్గింపు విలువను అంగీకరించాలి” అని నిర్వాహకులు వాదిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, మైఖేల్ జాక్సన్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ అలవెన్స్ ద్వారా చెల్లింపులు అందుకుంటున్నారని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. “పబ్లిక్గా అందుబాటులో ఉన్న ప్రొబేట్ కోర్టుకు అందించిన యాన్యువల్ నివేదికలలో మైఖేల్ తల్లి, పిల్లలకు సుపోర్ట్ ఇవ్వడానికి ఎస్టేట్ చాలా మొత్తంలో డబ్బును అందజేస్తుందని అందులో ఉంది. మైఖేల్ పిల్లలకు ఏదైనా అవసరమైనప్పుడు మైఖేల్ కోరుకున్నట్లుగానే వారు చాలా బాగా చూసుకునేలా ఎస్టేట్ వారితో కలిసి పని చేస్తుంది అంటూ ఆ ప్రకటనలో తెలిపారు.