Suresh Gopi : తెలుగు రాష్ట్రాలతో పాటు నేడు దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల వెల్లడి జరిగిందన్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిది రాష్ట్రాలలో పైగా అసెంబ్లీ తో పాటు, ఎంపీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణాలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి చెరో ఎనిమిది స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు విజయం సాధించగా, ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి గా పోటీ చేసిన తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ జనసేన నుండి ఏకంగా పోటీ చేసిన 21 సీట్లలోనూ 21 కూడా గెలిచి విక్టరీ సాధించింది. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అలాగే నార్త్ లో చాలామంది సినీ సెలెబ్రిటీలు పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక సౌత్ లో కేరళలో ఎప్పుడూ కమ్యూనిస్ట్ పార్టీలు రాజ్యమేలుతాయన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తొలిసారి కేరళలో ఓ రికార్డు వచ్చి పడింది.
భారీ విజయం సాధించిన సురేష్ గోపి..
ఇక కేరళలో దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. తొలిసారి కేరళ లోక్సభ నుంచి బీజేపీ గెలుపొందింది. మలయాళ స్టార్ నటుడు సురేశ్ గోపీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి వీఎస్ సునీల్ కుమార్ పై దాదాపు 73వేలకు పైగా ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. ఇక అధిక శాతం విద్యావంతులు ఉన్న కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్టులు గెలుస్తూ వస్తున్నారు. అయితే తొలి సారి లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక నటుడైన సురేశ్ గోపి రాజకీయ ప్రయాణం 2016లో మొదలైంది. ప్రముఖ పౌరుల కేటగిరీలో భారత రాష్ట్రపతి ఆయన్ను రాజసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. అదే సంవత్సరం అక్టోబర్లో బీజేపీలో ఆయన చేరారు. పార్లమెంటు ఎగువ సభలో గోపి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా, పౌర విమానయాన సంప్రదింపుల కమిటీ సభ్యునిగా పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో త్రిస్సూర్ పోటీ చేసి ఓడిపోయారు. ఆపై 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు. అంతకు ముందు కేరళ లోక్సభ ఎన్నికల్లో 2,93,822 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఇక ఈ సారి సురేష్ గోపి 4,13700 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు.
నార్త్ లోనూ సెలెబ్రిటీల హవా..
ఇక కేరళలో సురేష్ గోపి (Suresh Gopi) త్రిస్సూర్ లో తొలిసారిగా గెలవగా, అక్కడ బిజెపి పార్టీ కూడా తొలిసారిగా ఎంపీ సీటు గెలిచింది. ఇక నార్త్ లో చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కంగనా రనౌత్, హేమ మాలిని, అరుణ్ గోవిల్, గోవిందా వంటి సెలెబ్రిటీలు పలు రాష్ట్రాలలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. క తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి సినీ సెలెబ్రిటీలు గ్రాండ్ విక్టరీని సాధించారు.