HBD Bhaskara Bhatla : తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ తరం రచయితల్లో బాగా పేరు పొందిన దర్శకులు ఎవరంటే చంద్రబోస్, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ ఇలాంటి వాళ్ళ పేర్లు ముందు చెప్పుకుంటారు. కానీ వీళ్ళతో ఏమాత్రం తగ్గని టాలెంట్ ఉన్న అద్భుతమైన రచయిత “భాస్కర భట్ల”. ఒకప్పుడు ఈయన రచించిన పాటలకు సినిమాల్లో సూపర్ క్రేజ్ ఉండేది. ముఖ్యంగా లవ్ స్టోరీలలో భాస్కరభట్ల రచించే అద్భుతమైన పాటల శైలి ఈనాటి ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ప్రేక్షకులు మెచ్చేలా సరళమైన భాషలో పాటలు రాయడం భాస్కర భట్ల స్పెషలిటీ. ఇక నవతరం దర్శకుల దృష్టి మొత్తం యువతరాన్ని ఆకట్టుకోవాలన్నదే. అందులో భాగంగానే తమ చిత్రాలలో మోడరన్ థాట్స్ కు తగ్గ దరువులు ఉండాలనీ కోరుకుంటారు. అందుకు తగ్గ పదాలు నిండిన పాటలూ కావాలని ఆశిస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్న దర్శకనిర్మాతలకు పెద్ద దిక్కయ్యేవాడు భాస్కర భట్ల. ఆయన రాసిన ఎన్నో పాటలు నేటికీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుండగా ఒక రచయితగా తాను ఆశించిన గొప్ప స్థానం ఇంకా రాలేదు అని అంటుంటారాయన. అయినా ఇప్పటికి తనవంతు కృషి చేస్తూనే మంచి గొప్ప పేరు సంపాదించాడని ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక ఈ రోజు భాస్కర భట్ల (HBD Bhaskara Bhatla) (జూన్5) పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకీ బర్త్ డే విషెస్ ని అందచేస్తూ భాస్కర భట్ల గురించి మరికొన్ని విశేషాలని తెలుసుకుందాం..
జర్నలిస్ట్ జాబ్ వదిలి రచయితగా…
భాస్కర భట్ల అర్చకత్వం ఉన్న కుటుంబంలో 1974 జూన్ 5న జన్మించగా, ఆయన పూర్తి పేరు భాస్కరభట్ల రవికుమార్. బాల్యంలోనే తెలుగు సాహిత్యంపై అభిమానం కలిగిన భాస్కరభట్ల తన తాత అరవెల్లి కన్నరాజ గోపాలాచార్యుల వద్ద అభ్యసించిన సాహితీ ప్రక్రియలతో సాహిత్యంపై మరింత మక్కువ పెరిగింది. అయితే ‘ఈనాడు’ కాంపౌండ్ లోని సితార సినిమా మేగజైన్ లో ఫిలిమ్ జర్నలిస్ట్ గా మారారు. కొన్నేళ్ళు అక్కడ పనిచేసిన తరువాత ఇది కాదు తన గమ్యం అని తెలుసుకుని, సితార సినిమా జర్నలిస్ట్ ఉద్యోగాన్ని వదులుకుని, చిత్రసీమలో గీతరచయితగా ప్రయత్నాలు మొదలెట్టారు. తొలి రోజుల్లోనే చక్రి వంటి సంగీత దర్శకుడు, పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు భాస్కరభట్లను ప్రోత్సహించారు. ఇక బాలకృష్ణ నటించిన గొప్పింటి అల్లుడు సినిమాలో తొలి పాట రాసిన భాస్కర భట్ల గుర్తింపు మాత్రం పూరి జగన్నాథ్ సినిమాలతో తెచ్చుకున్నాడు. చక్రి, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన చాలా సినిమాలకు భాస్కరభట్ల పాటలు రాసారు. “రామసక్కని బంగారు బొమ్మా… రాసలీలకు వస్తావ”, “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే…”, “చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా…”, “లేలేత నవ్వులా… పింగాణి బొమ్మలా…” అంటూ ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ వీరి కాంబినేషన్ లో వచ్చాయి. ఇక “గాల్లో తేలినట్టుందే… గుండె పేలినట్టుందే…” అంటూ జల్సా లో ప్రేమికుల నరాలు జివ్వు మనిపించారు. ఇక “కృష్ణానగరే మామా… పాటతో నవ్వుల మాటున దాగిన సినీజీవుల కన్నీటి గాథలను ప్రేక్షకులకు తెలిసేలా చేసారు. ఇలా ఏది చేసినా భాస్కరభట్ల పాటల్లో పైకి వినిపించే పదాల మాటున దాగిన అర్థం కొన్నిసార్లు పెదాలను తడిచేయిస్తుంది.
దరిచేరని అవార్డులు…
ఇక గొప్పింటి అల్లుడు తో మొదలైన భాస్కర భట్ల పాటల ప్రయాణం ఆ తరువాత చిరంజీవి ‘ఆచార్య’లో “శానా కష్టం వచ్చిందే…” పాటల వరకు సాగుతుంది. రీసెంట్ గా పాటలు రాయడం తగ్గించినా, తనకు అవకాశం వస్తే.. ఎలాంటి సమయంలోనైనా ప్రూవ్ చేసుకునేదాకా వదలదు. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ పాటలతో ఆడేసుకుంటున్నారు భాస్కరభట్ల. ఇప్పటికే వందలాది పాటలతో సందడి చేసిన భాస్కరభట్ల పాటకు ఇప్పటికీ ఎందరో సినీజనం పట్టాభిషేకం చేస్తూనే ఉన్నారు. కమర్షియల్ లిరిసిస్ట్ గా భాస్కరభట్ల సక్సెస్ రూటులో సాగిపోతున్నారు. ఆయన పాటకు తగ్గ ప్రభుత్వ అవార్డులే ఇంకా దరి చేరలేదు. అప్పుడెప్పుడో బొమ్మరిల్లు లో బొమ్మను గీస్తే పాటకు, అలాగే నేనింతే లో కృష్ణానగర్ పాటకు సంతోషం ఫిలిం ఫేర్ అవార్డ్స్ రాగా, ఆ తర్వాత బిజినెస్ మెన్ లో సారొస్తారా పాటకు సైమా అవార్డు పొందారు. కానీ ఒక్క నంది అవార్డు రాలేదు. భాస్కరభట్లకు ఆ తన శ్రమకు తగిన గుర్తింపు రావాలని ఆయన కోరిక తీరే రోజు రావాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.