Karan Johar : ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తాజాగా హిందీ సినిమా షాదీ కే డైరెక్టర్ కరణ్ ఔర్ జోహార్ నిర్మాతలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో తన పేరును చట్టవిరుద్ధంగా ఉపయోగించడంపై కరణ్ జోహార్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సినిమా టైటిల్లో తన పేరును ఉపయోగించకుండా నిరోధించాలని నిర్మాత కరణ్ కోర్టును అభ్యర్థించారు.
స్టే విధించాలంటూ రిక్వెస్ట్
షాదీ కే డైరెక్టర్ కరణ్ ఔర్ జోహార్ సినిమా టైటిల్లో తన పేరును చట్టవిరుద్ధంగా ఉపయోగించడాన్ని ప్రస్తావిస్తూ నిర్మాత కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ జూన్ 14న విడుదల కానున్న ఈ సినిమా విడుదలపై తక్షణమే స్టే విధించాలని తన పిటిషన్లో డిమాండ్ చేశారు. నిర్మాత సంజయ్ సింగ్, రచయిత-దర్శకుడు బబ్లూ సింగ్ షాదీ కే డైరెక్టర్ కరణ్ ఔర్ జోహార్ సినిమా టైటిల్లో కరణ్ జోహార్ పేరును ఉపయోగించారు.
ఈ పిటిషన్ను బుధవారం జస్టిస్ ఆర్ఐ చాగ్లా సింగిల్ బెంచ్ ముందు సమర్పించగా, గురువారం అంటే జూన్ 13న పిటిషన్ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. కరణ్ ఈ సినిమా టైటిల్ లో నేరుగా తన పేరును ఉపయోగించారని, తన వ్యక్తిగత హక్కులు, ప్రైవసీ హక్కులను ఉల్లంఘించారని ధర్మాసనం ముందు వివరించారు.
ప్రతిష్టను దిగజరస్తున్నారు అంటూ..
అనుమతి లేకుండా తన ‘బ్రాండ్ పేరు’ని ఉపయోగించడం ద్వారా, షాదీ కే డైరెక్టర్ కరణ్ ఔర్ జోహార్ చిత్రనిర్మాతలు తన సద్భావన, ప్రతిష్టను తారుమారు చేస్తున్నారని కరణ్ వ్యాఖ్యానించారు. ఈ చిత్రం జూన్ 14న విడుదల కానుందని, ట్రైలర్, పోస్టర్లతో సహా బహిరంగ ప్రదేశాలు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిందని పిటిషన్ లో హైలెట్ చేశారు. ప్రమోషనల్ మెటీరియల్స్ తన ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని జోహార్ ఎత్తి చూపారు.
“ఈ ట్రైలర్లు పోస్టర్లు జోహార్కు ఉన్న పేరు, ప్రతిష్టకు కోలుకోలేని నష్టాన్ని కలిగించాయి. ఇంకా అతని బ్రాండ్ పేరు ‘కరణ్ జోహార్’ అనే టైటిల్తో కలిపి లేదా భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది. దీనివల్ల కోలుకోలేని నష్టం కలగడంతో పాటు భారీ మొత్తంలో సమయం, కృషి, డబ్బును పెట్టుబడి పెట్టి సంపాదించిన పరువు, కీర్తిని దెబ్బతింటుంది” అని కరణ్ వేసిన దావాలో పేర్కొన్నారు. మరి ఈ విషయంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
కరణ్ జోహార్ సినిమాల విషయానికొస్తే..
కరణ్ జోహార్ ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్న తన తదుపరి చిత్రం కిల్ విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని గత ఏడాది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శించారు. ఈ సినిమా ట్రైలర్ని నిన్న బుధవారం విడుదల చేయగా, దానికి మంచి స్పందన వచ్చింది. కిల్ మూవీకి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించగా, రాఘవ్ జుయల్, లక్షయ్ లాల్వానీ, తాన్య మాణిక్తలా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 5న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.