Arvind Swamy : ప్రముఖ నటుడు అరవింద్ సామి ఈరోజు అంటే జూన్ 18న తన 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకు పలువురు ఆయనకు ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అరవింద్ సామి తన తొలి చిత్రం తలపతి సెట్లో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పిన ఓ విషయం ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆయన అరవింద్ సామి ఏకంగా రజినీకాంత్ ను నేలపై పడుకోబెట్టారట. అసలు కథ ఏంటో తెలుసుకుందాం పదండి.
దళపతి షూటింగ్ లో…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన దళపతి మూవీ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అరవింద్ సామి కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఇక అక్కడ జరిగిన విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో అరవింద్ సామి వివరించారు. అరవింద్ మాట్లాడుతూ “షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను షూటింగ్ సైట్కి వెళ్లాల్సిన సమయానికంటే ముందే చేరుకున్నాను. అందుకే నేను షూటింగ్ సైట్ని సందర్శించాలని ప్లాన్ చేసాను. దళపతి సినిమా కోసం సెట్ చుట్టూ చూసాక ఒక గదిలోకి వెళ్ళాను. రూమ్లో మంచి బెడ్ ఉండడంతో అక్కడ కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుని అక్కడే పడుకుండి పోయాను” అని అన్నారు.
నేలపై పడుకున్న సూపర్ స్టార్
అరవింద్ సామి ఇంకా మాట్లాడుతూ “కాసేపటి తర్వాత నిద్ర లేచి చూసేసరికి నేను పడుకున్న గది నేలపై ఎవరో పడి ఉన్నారు. తీరా గమనించి చూస్తే ఆయన మరెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. నేను ఇంతసేపు విశ్రాంతి తీసుకున్న గది సూపర్ స్టార్ గది అని అప్పుడే అర్థమైంది. సూపర్ స్టార్ అయినప్పటికీ రజనీకాంత్ నేను నిద్రపోవడం చూసి నన్ను లేపకుండా నేలపైనే పడుకున్నాడు’’ అంటూ రజినీ మృదు స్వభావం గురించి చెప్పుకొచ్చారు. తాజాగా అరవింద్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం మరోసారి వైరల్ అవుతోంది.
అరవింద్ కు ఇదే మొదటి మూవీ
తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన దళపతి చిత్రం 1991లో విడుదలై తమిళ చిత్రసీమలోనే భారీ విజయాన్ని అందుకున్న మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ సినిమాలోని పాటలు ఓ ఊపు ఊపేశాయి అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ దళపతి పాటలు సూపర్ స్టార్ అభిమానుల ఎవర్ గ్రీన్ ఫేవరెట్ సాంగ్స్ లిస్ట్ లో ఉంటాయి. అంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, శోభన ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో అరవింద్ సామి కలెక్టర్ పాత్రను పోషించారు. నటుడిగా అరవింద్ సామికి ఇదే తొలి సినిమా. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో మళ్లీ హీరోగా తమిళం సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఈ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించడంతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన.