Drugs Case : శాండల్వుడ్లో పెను సంచలనం సృష్టించిన శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో నటి సంజ్జనా గల్రానీ, శివప్రకాష్ చిప్పీలకు పెద్ద ఊరట లభించింది. వీరిద్దరిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. దీంతో రెండళ్లుగా సాగుతున్న డ్రగ్స్ కేసులో నటి సంజనా గల్రానీ, నిర్మాత శివప్రకాష్ చిప్పీలు ఉపశమనం పొందారు.
డ్రగ్స్ కేసులో సంజన అరెస్ట్
డ్రగ్స్ నెట్వర్క్తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై నటీమణులు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేది, నిర్మాత శివప్రకాష్ చిప్పి సెప్టెంబర్ 2020లో అరెస్టయ్యారు. ఆ తర్వాత జైలులో ఉన్న సంజన అనారోగ్య కారణాలతో డిసెంబర్లో బెయిల్ పొందారు. అనంతరం ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ సంజన, శివప్రకాష్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్ మెంబర్ నిన్న (జూన్ 24)న ఈ పిటిషన్ను విచారించి ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2020లో శాండల్వుడ్ను కుదిపేసిన సంచలన డ్రగ్ కేసులో మొదటి నిందితుడు, వ్యాపారవేత్త శివప్రకాష్ అలియాస్ చిప్పీ, నటి సంజ్జనా గల్రానీ, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి ఆదిత్య అగర్వాల్లపై విధానపరమైన లోపాలను పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు విచారణను రద్దు చేసింది. ముగ్గురు నిందితులు-పిటిషనర్లను అరెస్టు చేసిన సమయంలో వారి నుండి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని జస్టిస్ హేమంత్ చందన గౌడర్ ఎత్తి చూపారు. ఎఫ్ఐఆర్ ఏప్రిల్, సెప్టెంబర్ 2020 మధ్య నిందితులు చేసిన నేరాలను ప్రస్తావించిందని, అయితే సంజ్జనాపై ఛార్జిషీట్లో ఉదహరించిన సందర్భాలు, ఆదిత్యపై విచారణను న్యాయమూర్తి ప్రస్తావిస్తూ, ఒక వ్యక్తిని 12 నెలల్లోపు ఒకే రకమైన మూడు నేరాలకు సంబంధించి ఒక విచారణలో విచారించవచ్చని న్యాయమూర్తి సూచించారు. కాగా చివరకు ఈ కేసులో విచారణను రద్దు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో సంజనాకు ఊరట లభించింది. కానీ ఆమెకు మళ్లీ సినిమా ఇండస్ట్రిలో చోటు దక్కుతుందా అనేది మాత్రం అనుమానమే. ఇక ఈ బ్యూటీ ప్రభాస్ తో కలిసి బుజ్జిగాడు అనే సినిమాలో నటించింది.
వివాదం ఏంటంటే?
2020 ఆగస్ట్ 26న ప్రముఖులు, సినీ నటులు, నటీమణులు, వ్యాపారవేత్తల పిల్లలు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారనే సమాచారం ఆధారంగా బెంగళూరులోని కళ్యాణ నగర్లోని రాయల్ సూట్స్ హోటల్పై ఎన్సిబి అధికారులు దాడి చేశారు. అప్పట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు అనుప్, రవీంద్రన్, డి. అంకిత అనే డ్రగ్స్ వ్యాపారులను అరెస్ట్ చేశారు. అనంతరం విచారణలో వాళ్ళు శాండల్ వుడ్ నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే బాంబ్ లాంటి వాస్తవం బయటపడింది. ఆ తర్వాత ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేశారు.
ఛార్జిషీట్లో కన్నడ నటి రాగిణి ద్వివేది సహా 27 మంది పేర్లు ఉన్నాయి. నిందితులు నిర్వహించే పార్టీలలో ఎక్స్టాసీ మాత్రలు సేవించి, ఇతరులను వినియోగించేలా ప్రేరేపించారని అభియోగాలు మోపారు. ఈ కేసులో నిందితుడు నెం. 3గా ఉన్న సామాజికవేత్త వీరేంద్ర ఖన్నాపై విచారణను కర్ణాటక హైకోర్టు 2022 జనవరి 17న రద్దు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.