Kalki 2989Ad: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఉన్న స్థాయి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగులో ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూడటం మొదలుపెట్టారు. తెలుగు సినిమా స్థాయిని ఇద్దరు దర్శకులు శిఖరం మీద కూర్చోబెట్టారు. ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్, సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాలు తెలుగువాడి సత్తాని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పాయి. ఇప్పుడు అదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కల్కి సినిమా వస్తుంది అని అంటే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
సంగీతం పై మక్కువ
ఒక దర్శకుడి ఆలోచనను నమ్మి డబ్బులు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఒక దర్శకుడు పైన ఎంతో నమ్మకం ఉంటే గాని అంతటి సాహసం చేయరు. ఇకపోతే అశ్వినీ దత్ నిర్మిస్తున్న కల్కి సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఉన్న అగ్ర నిర్మాతలలో అశ్వినీ దత్ ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు సినిమా చరిత్రలో అందించిన ఘనత ఈ నిర్మాతకు ఉంది. వీటితోపాటు సంగీతం పైన మక్కువ, సాహిత్యం పైన అవగాహన తో పాటు గౌరవం ఉన్న అతి తక్కువ మంది నిర్మాతలలో అశ్విని దత్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక హీరోకి ఇంట్రడక్షన్ సాంగ్ గా “యమహా నగరి” లాంటి పాటను పెట్టడంలో అశ్విని దత్ పాత్ర కూడా ఉంది.
అంచనాలను పెంచిన సాహిత్యం
ఇకపోతే ప్రస్తుతం అశ్విని దత్ నిర్మిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన థీమ్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ థీమ్ సాంగ్, సినిమా పైన అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పొచ్చు. ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని చంద్రబోస్ ఈ పాటకు అందించారు. ఒక సాహిత్య రచయితకు సరైన సందర్భం దొరికితే ఎంతగా తన ప్రతిభను చూపించొచ్చు అని మరోసారి చంద్రబోస్ నిరూపించారు.
సాహిత్యం:
అధర్మాన్ని అణిచేయ్యగ
యుగయుగాన.. జగములోన
పరిపరి విధాల్లోన విభవించే.. విక్రమ విరాట్రూపమితడే
స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే..
మీనమై.. పిదప కూర్మమై
తను వరాహమై.. మనకు సాయమై
బాణమై.. కరకు ఖడ్గమై
చురుకు ఘూతమై.. మనకు ఊతమై
నిశి తొలిచాడు దీపమై
నిధనం తన ధ్యేయమై
వాయువే.. వేగమై
కలియుగ స్థితిలయలే కలబోసే కల్కి ఇతడే
స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే..
ప్రార్థనో.. మధుర కీర్తనో
హృదయ వేదనో.. మన నివేదనం
అందితే.. మనవి తక్షణం
మనకు సంభవం.. అతడి వైభవం
అధర్మాన్ని అణిచేయ్యగ
యుగయుగాన జగములోన
పరిపరి విధాల్లోన.. విభవించే విక్రమ విరాట్రూపమితడే
స్వధార్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే
వంటి సాహిత్యంతో సినిమా కథ అంతుచిక్కకుండా పాటను పూర్తి చేశారు చంద్రబోస్.
నిర్మాత ప్రశంసలు
ప్రస్తుతం చంద్రబోస్ రచించిన ఈ పాటకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటిని మించి సినిమా నిర్మాత అశ్విని దత్ చంద్రబోస్ ను ప్రశంసించారు. అప్పటి రచయితలు ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి సాహిత్య రచయితలతో పోలుస్తూ మళ్లీ వాళ్లను గుర్తు చేశావు అంటూ చంద్రబోస్ గారిపై సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అశ్విని దత్.
నాకు మళ్ళీ మా ఆత్రేయ గారిని, వేటూరి గారిని, సిరివెన్నెల గారిని గుర్తు చేశావయ్యా, చంద్రబోస్!
Thank you for this great gift. https://t.co/MV2eWwIrRa@boselyricist #Kalki2898AD
— Chalasani Aswini Dutt (@AshwiniDuttCh) June 25, 2024