Comedian Prudhviraj : 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కు తాజాగా వరకట్నం కేసులో ఊరట లభించింది. దాదాపు 8 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు నుంచి ఎట్టకేలకు ఆయన బయటపడ్డాడు. తాజాగా ఈ కేసు విచారణకు రాగా పృథ్వీరాజ్ పై వచ్చిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో న్యాయస్థానం పృథ్వీరాజ్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
పృధ్వీ రాజ్ కు బిగ్ రిలీజ్
దాదాపు ఎనిమిదేళ్లుగా పెండింగ్లో ఉన్న వరకట్నం కేసులో ప్రముఖ నటుడు, జనసేన నాయకుడు పృధ్వీ రాజ్కు విజయవాడ కోర్టు నుంచి ఉపశమనం లభించింది. మొన్న ఏసీఎంఎం కోర్టులో జరిగిన విచారణకు కూడా పృధ్వీ హాజరయ్యారు. చివరగా అతనికి అనుకూలంగా సానుకూల తీర్పుతో రావడంతో గత ఎనిమిదేళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్న ఈ కేసు నుంచి ఆయన బయట పడ్డట్టుగా అయ్యింది.
వివాదం ఏంటంటే?
2016లో పృధ్వి భార్య శ్రీలక్ష్మి విజయవాడ సూర్యారావు పేట పోలీస్ స్టేషన్లో తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పృధ్వీపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేశారు. పెళ్లి సమయంలో డబ్బు, బంగారు ఆభరణాలు కట్నంగా తీసుకున్నప్పటికీ అదనపు కట్నం కోసం పృధ్వి తనను వేధించేవాడని శ్రీలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొంది. సినిమాల్లో తన కెరీర్ను కొనసాగించేందుకు హైదరాబాద్కు వెళ్లిన తర్వాత అతను తనను నిర్లక్ష్యం చేశాడని ఆమె పేర్కొంది. కేసును విచారించిన పోలీసులు 2017లో విజయవాడలోని రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వద్ద చార్జిషీట్ దాఖలు చేశారు.
అప్పటి నుంచి ఇరువర్గాల వాదనలతో కోర్టులో కేసు నడుస్తోంది. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన జస్టిస్ మాధవీ దేవి నిన్న తన తీర్పును వెలువరించారు. పృధ్వీకి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేనందున, కేసు కొట్టివేస్తున్నట్టున్నగా న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఈ కేసు నుంచి ఆయన బయటపడ్డాడు.
భార్యా, పిల్లలకు దూరం
టాలీవుడ్ ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీగా పేరు తెచ్చుకున్న ఈ కమెడియన్ అసలు పేరు బాలిరెడ్డి పృథ్వీరాజ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన పృథ్వీరాజ్ కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీతో 1984లో పెళ్లయింది. ఈ జంటకు ఓ కొడుకు, కూతురు ఉండగా, కొన్నేళ్ల నుంచి విభేదాల కారణంగా పృథ్వీరాజ్ తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆయన ఇటు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటే, భార్య శ్రీలక్ష్మి తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 2017లో శ్రీలక్ష్మి తన భర్త పృధ్వీ నుంచి నెలకు 8 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ కోర్టు ఎక్కారు. అతను సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి పృధ్వీ ఖర్చులతో సహా అన్ని తన తల్లిదండ్రులే భరించారని ఆమె కోర్టుకి విన్నవించుకుంది. అలాగే సినిమాల్లోకి వెళ్లిన తర్వాత తరచుగా తనను వేధించాడని, 2016 ఏప్రిల్ 5న ఏకంగా ఇంట్లో నుంచి గెంటేసారని, అందుకే ప్రస్తుతం పుట్టింటో ఉంటున్నానని ఆమె కంప్లైంట్ చేసింది.