Producer : గత కొంతకాలంగా వివాదాలతో ఇబ్బంది పడుతున్న ఓ టాలీవుడ్ బడా హీరో తాజాగా ఇద్దరు స్టార్ హీరోలను సీక్రెట్ గా కలిశారన్న వార్త బయటకు వచ్చింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తన మాతృ భాష కాని ఇండస్ట్రీలో తగ్గేదేలే అంటూ జండా పాతడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఆ ప్రొడ్యూసర్ ఎవరు? హీరోలను ఎందుకు సీక్రెట్ గా కలిశారు? అనే వివరాల్లోకి వెళ్తే..
ముంబై ప్రయాణాల సీక్రెట్ ఇదేనా ?
బాహుబలి నుంచి కల్కి దాకా పలు పాన్ ఇండియా సినిమాలతో తెలుగు సినిమా సత్తా ఏంటో ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ను దాటి అన్ని భాషల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఉవ్విళ్లూరుతున్నారు. తమదైన అభిరుచితో మూవీ లవర్స్ కు కొత్త కొత్త కథలను పరిచయ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన నిర్మాణ వ్యాపారాన్ని ఇతర పరిశ్రమలకు కూడా విస్తరిస్తున్నాడు. గత ఏడాది తమిళంలో దళపతి విజయ్తో ‘వరిసు’ చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టాడు. ఇప్పుడు బాలీవుడ్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే రీసెంట్ టైమ్స్ లో ఆయన ఎక్కువగా ముంబైకి ట్రిప్స్ వేస్తున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి.
సైలెంట్ గా ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారా?
స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజూ ఇటీవల ముంబై పర్యటనలో ఇద్దరు స్టార్ హీరోలను కలిశారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఓ రెండు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఈ సంవత్సరం చివరి నాటికి దిల్ రాజు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు రాబోయే కొన్నేళ్లు పాటు పాన్-ఇండియన్ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. అందుకే దిల్ రాజు హిందీ మార్కెట్ పై దృష్టి సారిస్తున్నారు. అయితే మరోవైపు తెలుగులో చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలను చేసే ఛాన్స్ ను కూడా వదలడం లేదు. కానీ బాలీవుడ్ నుండి స్టార్స్తో పని చేయాలనే ఆసక్తితో ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.
బెడిసికొట్టిన ఆ రెండు సినిమాలు
దిల్ రాజు ఇప్పటికే హిందీలో ‘హిట్’, ‘జెర్సీ’ వంటి చిత్రాలను నిర్మించారు. కానీ అవి కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ఈ రీమేక్లు జనాలను థియేటర్లకు రప్పించడంలో విఫలమయ్యాయి. అయినప్పటికీ దిల్ రాజు బాలీవుడ్లో తనదైన ముద్ర వేయాలనే మొండి పట్టుదలతో ఉన్నాడు. ఆ ప్రయత్నాల కోసమే ఆయన హైదరాబాద్ – ముంబై మధ్య ప్రయాణాలు చేస్తున్నట్టు సమాచారం. 2025లో రెండు కొత్త పెద్ద చిత్రాలను ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్న దిల్ రాజు ఇప్పటికే షాహిద్ కపూర్, వంశీ పైడిపల్లి కాంబో ప్రాజెక్టును నిర్మించే ఆలోచనలో ఉన్నారు.