నటి అమల పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు, తమిళంతో పాటు ఆమె కొన్ని వెబ్ సిరీస్ల్లో కూడా నటించారు. తాజాగా ఆమె తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. టాలీవుడ్కి దూరమైన అమలపాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలుగులో అతి తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాలను వివరించారు. తెలుగు చిత్ర పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందని.. తెలుగు చిత్ర పరిశ్రమను సినీ కుటుంబాలు, అభిమానులే శాసిస్తున్నారని చెప్పుకొచ్చింది.
వారు తీసే సినిమాలు కూడా చాలా భిన్నంగా ఉండేవి అని, వారి ప్రతీ సినిమాలో ఇద్దరూ హీరోయిన్లు ఉండేవారని.. గ్లామరస్ గా చూపిస్తూ లవ్ సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం చేసేవారు అని అమలపాల్ చెప్పుకొచ్చారు. కేవలం తెలుగులో నాలుగు సినిమాలు మాత్రమే తీశారు..? ఎక్కువ ఎందుకు చేయలేదని ప్రశ్నించగా..? అందుకు అమలా స్పందిస్తూ.. నేను తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాను. అక్కడ ఫ్యామిలీ కాన్సెప్ట్ నడుస్తోంది. ఆ ఇండస్ట్రీలో సినీ కుటుంబాలు, వారి వారసులు, అభిమానులదే పై చేయి. ఇక తెలుగులో తెరకెక్కేది అన్ని కమర్షియల్ చిత్రాలే అని చెప్పుకొచ్చింది.
అందుకే తాను తెలుగు ఇండస్ట్రీకి దగ్గర కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్ తొలినాళ్లలో ఆడిషన్స్, మీటింగ్స్ వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానన్న అమలాపాల్.. తమిళ సినిమాతో కెరీర్ ప్రారంభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. కెరీర్ ప్రారంభంలో చేసిన రెండు సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదు అని, ఆ తరువాత చేసిన మైనా సంచలనం సృష్టించిందని గుర్తు చేశారు. ఆ చిత్రం హిట్ తరువాత వరస ఆఫర్లు వచ్చాయని చెప్పారు. ఇక ఈమె తెలుగులో నాయక్, లవ్ ఫెయిల్యూర్, ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు వంటి సినిమాల్లో నటించారు. చివరిసారిగా పిట్టకథలు సినిమాలో కనిపించారు. ఈమె నటించిన తాజా చిత్ర ‘కడవర్’ ఓటీటీలో విడుదలైంది.