Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయ్యింది. ఆమె వివిధ చిత్రాలలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. 2024లో తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా, క్రూతో వరుసగా ఆమె నటించిన రెండు సినిమాలు విడుదల కావడమే కాదు. బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచాయి. ప్రస్తుతం రెండు సినిమాల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కృతి సనమ్ తాజాగా బీచ్ టౌన్ అలీబాగ్లో ఆస్తిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
అమితాబ్ పొరుగునే కృతి ప్రాపర్టీ
ఇటీవల కాలంలో బాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. రీసెంట్ గా అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ ఇలాగే భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ మీడియా నివేదిక ప్రకారం కృతి సనన్ రూ. 2 కోట్లకు పైగా ఖరీదు చేసే 2,000 చదరపు అడుగుల ప్రీమియం ప్లాట్ను కొనుగోలు చేసింది. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) ప్రాజెక్ట్లో భాగమైన ప్లాట్ ను కృతి కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇదే ప్రాజెక్టు లో 10,000 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసిన మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పక్కన కృతి ఈ ఆస్తిని సంపాదించడం విశేషం.
కొత్త ప్రాపర్టీపై కృతి రియాక్షన్
ఈ ప్రాజెక్టులో తన పెట్టుబడి గురించి కృతి మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. “నేను ఇప్పుడు అభినందన్ లోధా, అందమైన అభివృద్ధి, సోల్ డి అలీబాగ్లో గర్వంగా, సంతోషంగా ఉన్న భూ యజమానిని. నా స్వంతంగా భూమిని కొనుగోలు చేయడం చాలా సాధికారతను కలిగించే ప్రయాణం. నేను గత కొంతకాలంగా అలీబాగ్పై దృష్టి పెట్టాను. నేను వెతుకుతున్న దాని గురించి నాకు చాలా స్పష్టత ఉంది. శాంతి, ప్రైవసీని ఇచ్చే ఈ ప్రాపర్టీ నా పోర్ట్ఫోలియోలో మరో గొప్ప పెట్టుబడి” అంటూ చెప్పుకొచ్చింది.
తాను పెట్టిన ఈ పెట్టుబడి తన తండ్రికి కూడా బాగా నచ్చిందని కృతి పేర్కొంది. మాండ్వా జెట్టి నుండి 20 నిమిషాల కంటే తక్కువ దూరంలో ఉన్న ప్రధాన ప్రదేశంలో ఉన్న ఆస్తి అంశాలను ఆమె హైలైట్ చేసింది. తనకు కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసినందుకు హౌసింగ్ సొసైటీని ఈ బ్యూటీ మెచ్చుకుంది. ప్రస్తుతం అలీబాగ్లో పెట్టుబడి పెట్టడానికి తనకు ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదని పేర్కొంది.
కృతి సనన్ కిట్టిలో ఉన్న సినిమాలు
క్రూ, తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియాతో వరుసగా రెండు వరుస విజయాలను సాధించిన తర్వాత కృతి కిట్టిలో దో పట్టి అనే సినిమా ఉంది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ఆమె నిర్మాతగా కూడా మారబోతోంది. ఈ చిత్రంలో కాజోల్, తన్వీ అజ్మీ, షాహీర్ షేక్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.