Rakshit Shetty : కన్నడ నటుడు, దర్శకుడు, నిర్మాత రక్షిత్ శెట్టి ఇటీవల కాపీ రైట్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రక్షిత్ శెట్టి తన సినిమాలో రెండు పాటలను తమ అంగీకారం లేకుండా వాడుకున్నారని MRT అనే ఆడియో సంస్థ ఆయనపై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసును కోర్టులోనే సెటిల్ చేస్తానని చెప్పిన రక్షిత్ శెట్టి తాజాగా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన కోర్టు మెట్లు ఎక్కారు.
వివాదం ఏంటంటే?
దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్ ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ ఎంటర్టైనర్ కన్నడ మూవీ ‘బ్యాచిలర్స్ పార్టీ’. కొన్ని వారాల క్రితం రిలీజైన ఈ మూవీని పరంవా స్టూడియోస్ బ్యానర్ పై రక్షిత్ శెట్టి నిర్మించారు. 2024 జనవరి 26న విడుదలైన ఈ సినిమాలో సందర్భానుసారంగా సినిమాలో రెండు పాత పాటల బిట్లను ఉపయోగించారు. దీంతో ఈ పాటల హక్కులను కలిగి ఉన్న MRT, రక్షిత్ శెట్టి, అతని నిర్మాణ సంస్థపై కోర్టులో కాపీరైట్ ఉల్లంఘన కేసును దాఖలు చేసింది. ఇదే కేసుకు సంబంధించి రక్షిత్ శెట్టి ఇప్పుడు బెంగుళూరులోని సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
‘బ్యాచిలర్స్ పార్టీ’ సినిమాలో ‘న్యాయ ఎల్లీడు’, ‘ఒమ్మే నేహే కంటుంబ కంటుంబ కంటువాసే ఎల్లిరువే’ పాటల్లోని చిన్న బిట్స్ మాత్రమే ఉపయోగించారు. నిజానికి సినిమాలో ఈ పాటలను ఉపయోగించే ముందు రక్షిత్ శెట్టి పాటల హక్కులను కలిగి ఉన్న MRT మేనేజ్మెంట్ ను కలుసుకుని అనుమతి కోరారు. అయితే ఈ పాటలను ఉపయోగించేందుకు MRT భారీ మొత్తాన్ని అడిగారు. ఈ కారణంతో రక్షిత్ శెట్టి వారి అనుమతి లేకుండానే తన సినిమాలో ఆ పాటల బీట్లను ఉపయోగించాడు. ఈ కేసుకు సంబంధించి నిర్మాత రక్షిత్ శెట్టిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం రక్షిత్ శెట్టికి చెందిన పరమావహ్ స్టూడియో ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ‘ఈ కేసును కోర్టులోనే ఎదుర్కొంటామని, ఇకపై ఎవరూ ఇలా ప్రవర్తించకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు.
ఇదే మొదటి వివాదం కాదు
కాపీరైట్ ఉల్లంఘన కేసులో రక్షిత్ చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. వేరే సినిమాకు సంబంధించి లహరి మ్యూజిక్ డైరెక్టర్ లహరి వేలుతో ఇలాగే కాపీ రైట్ వివాదంలో నాలుగేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు రక్షిత్ శెట్టి. 2016లో తన సినిమా కిరిక్ పార్టీ విడుదలైనప్పుడు రక్షిత్ కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడగా, ఆ వివాదం చాలాకాలం నడిచింది. ఇప్పుడేమో బ్యాచిలర్ పార్టీ సినిమాతో మరోసారి ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. ఈ సినిమా కంటే వివాదమే హాట్ టాపిక్ గా మారింది.
రక్షిత్ శెట్టి ప్రస్తుతం ‘రిచర్డ్ ఆంటోని’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘రిచర్డ్ ఆంటోనీ’ చిత్రానికి రక్షిత్ శెట్టి దర్శకత్వం వహించగా, హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ‘ఉలిదవారు కందంటే’ సినిమాలోని రిచర్డ్ క్యారెక్టర్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.