Tollywood : ఇన్ని రోజులూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న దిల్ రాజు గద్దె దిగే సమయం ఆసన్నమైంది. ఆయన పదవీకాలం ముగియడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షడి ఎన్నికలు మొదలు కాబోతున్నాయి. మరి ఈసారి ఛాంబర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది ఎవరు? ఈ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
ముగిసిన దిల్ రాజు పదవి కాలం
ఈనెల 31తో నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు పదవి కాలం ముగియనుంది. దీంతో జూలై 28న ప్రొడ్యూసర్ సెక్టార్ కు గానూ అధ్యక్ష పదవి కోసం ఛాంబర్ లో ఎన్నికలు జరనున్నాయి. ఈసారి అధ్యక్ష పదవికి (డిస్ట్రిబ్యూషన్ సెక్టార్) భరత్ భూషణ్ vs ఠాగూర్ మధు మధ్య పోటీ నెలకొంది.
కాగా ఈ ఎలక్షన్స్ కు మొత్తం ఓట్లు 48 ఉండగా, మెజారిటీ మార్క్ 25 దాటిన అభ్యర్థె అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి 16 ఓట్లు, ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి 12, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి 12 ఓట్లు, స్టూడియో ఎక్సిక్యూటివ్ కమిటీ నుంచి 4 ఓట్లు, సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు 4 ఉంటాయి. మరి ఈసారి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారో చూడాలి.
దిల్ రాజుకు ఆ నిర్మాతతో విభేదాలు?
2023 జూలైలో జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్సీసీ) అధ్యక్షుడిగా ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు. రాజు నేతృత్వంలోని ప్యానెల్ వివిధ కమిటీలతో నెలకొన్న హోరాహోరీ పోటీలో సి కళ్యాణ్ నేతృత్వంలోని ప్యానెల్ను ఓడించింది. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో దిల్ రాజుకు 48 ఓట్లు రాగా, ప్రత్యర్థి కళ్యాణ్కు 31 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షులుగా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా కెఎల్ దామోదర్ ప్రసాద్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా టి ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు.
దిల్ రాజును గత ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎగ్జిబిటర్స్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి గట్టి సపోర్ట్ లభించింది. దిల్ రాజు, అతని ప్యానెల్లోని ఆరుగురు సభ్యులు 12 మంది సభ్యుల నిర్మాత ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికయ్యారు. 20 మంది సభ్యుల ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్లో కూడా ప్యానెల్ మెజారిటీ సీట్లను గెలుచుకుంది.
డిస్ట్రిబ్యూటర్స్ కమిటీలో కళ్యాణ్, దిల్ రాజు ప్యానెళ్లకు ఆరు స్థానాలు దక్కాయి. స్టూడియో ఎగ్జిక్యూటివ్ కమిటీలో దిల్ రాజు ప్యానల్ నాలుగు సీట్లలో మూడింటిని కైవసం చేసుకుంది. 16 మంది సభ్యులతో కూడిన ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో దిల్ రాజు, కళ్యాణ్ చెరో ఎనిమిది స్థానాలను గెలుచుకున్నారు. అంతకుముందు ఫిల్మ్ నగర్లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో మొత్తం 1,600 మంది సభ్యులకు గానూ 1,339 మంది ఓటు వేశారు. అయితే అప్పట్లో దిల్ రాజుకు తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన నిర్మాత కళ్యాణ్ తో విబేధాలు ఉన్నాయని వార్తలు రాగా, ఆయన వాటిని కొట్టి పారేశారు. మరి ఈ ఎన్నికల తరువాత దిల్ రాజు స్థానంలోకి ఎవరు రాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.