Tanikella Bharani.. రంగస్థలం నటుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టిన తనికెళ్ల భరణి సుప్రసిద్ధ కవిగా, మాటల రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. 800 కు పైగా చిత్రాలలో నటించి తెలుగు వారి మనసు దోచుకున్న ఈయన తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలాంటి ఈయనకు ఇప్పుడు అరుదైన గౌరవం లభించింది గురువారం వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ వారు ఈయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. ఇకపోతే ఈ విషయం తెలిసిన తర్వాత నెటిజెన్లు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు.. ఎందుకంటే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా డాక్టరేట్ రాలేదా అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. త్వరలోనే ఈ డాక్టరేట్ తో ఆయనను సత్కరించనున్నారు.
తనికెళ్ల భరణికి డాక్టరేట్..
ఇకపోతే తాజాగా ఎస్ ఆర్ యూనివర్సిటీ వారు తనికెళ్ల భరణికి గౌరవ డాక్టరేట్ ప్రకటించారు.. ఆగస్టు మూడవ తేదీన శనివారం వరంగల్లో జరిగే ఎస్ ఆర్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలలో తనికెళ్ల భరణికి అందించనున్నారు.
40 సంవత్సరాల చరిత్ర ఉన్న విద్యా సంస్థ..
ఇకపోతే 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ విద్యాసంస్థ ఇప్పుడు యూనివర్సిటీగా మారిన తర్వాత ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ను గౌరవ డాక్టరేట్ తో గతంలో సత్కరించిన విషయం తెలిసిందే .ఇప్పుడు తనికెళ్ల భరణికి గౌరవ డాక్టరేట్ ప్రకటించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తనికెళ్ల భరణి సినీ కెరియర్..
తనికెళ్ల భరణి సినీ కెరియర్ విషయానికి వస్తే.. 52 సినిమాలకు మాటలను అందించి, రచయితగా మంచి పేరు పొందారు. విలక్షణమైన నటుడిగా పేరు దక్కించుకున్న తనికెళ్ల భరణి విలన్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాదు మహిళల చేత బెదిరింపులు కూడా పడ్డారు. మహిళలు ఈయనను పూర్తిస్థాయిలో విలన్ గా ఊహించుకున్నారు కాబట్టే ఈయనకు ఉత్తమ విలన్ గా అవార్డులు లభించాయి. అలా రాష్ట్ర ప్రభుత్వం నుండి సముద్రం సినిమాకు ఈయనకు ఉత్తమ విలన్ గా నంది అవార్డు లభించింది. అంతేకాదు నువ్వు నేను సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి కూడా ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు, గ్రహణం చిత్రంతో ఉత్తమ నటుడిగా అలాగే మిథునం సినిమాకు ఉత్తమ రచయితగా, ఉత్తమ దర్శకుడిగా కూడా వరుసగా ఐదు అవార్డులను సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు.
గొప్ప శివ భక్తులు..
ముఖ్యంగా ఈయన శివ భక్తుడు అని అందరికీ తెలిసిందే. ఈయనలోని ఆధ్యాత్మికత గురించి ఎంత చెప్పినా తక్కువే. నాలోన శివుడు కలడు అంటూ ఆయన రచించిన ఆల్బమ్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ అని చెప్పడమే కాదు శివుని ఆలయాలలో మారు మ్రోగుతూనే ఉంటుంది. ఇక ఎప్పుడూ కూడా శివమాల ధరిస్తూ తనలోని శివ భక్తిని చాటిచెబుతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.