Uppalapati SuryaNarayana PassesAway : ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఈ మధ్య వరుస మరణాలు విషాదం చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో మరో విషాదం జరిగింది. ప్రముఖ తెలుగు సీనియర్ నిర్మాత ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలిసి టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్ లో 80 ల్లో సినిమాలు నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆదివారం నాడు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. హైదరాబాద్ లో ఇంట్లో ఉండగానే ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే కుటుంబీకులు HYD అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు రాత్రి మరణించారు.
80ల్లో భారీ సినిమాలు నిర్మించిన నిర్మాత..
ఇక కృష్ణా జిల్లా రిమ్మనపూడికి చెందిన ఉప్పలపాటి సూర్యనారాయణ 1977 లో మనుషులు చేసిన దొంగలు సినిమాతో నిర్మాతగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ లో ఆ తర్వాత దొంగల దోపిడీ, రామ్ రాబర్ట్ రహీం, ఈ దేశంలో ఒకరోజు, సంధ్య, శంఖారావం, బజారు రౌడీ, కలియుగ విశ్వామిత్ర, అల్లుడు దిద్దిన కాపురం, అన్నదమ్ముల సవాల్, వంటి సినిమాలు నిర్మించారు. తెలుగు, కన్నడ హిందీ భాషలలో ఆయన 24 కి పైగా సినిమాలను నిర్మించారు.
సూపర్ స్టార్ కృష్ణతో అనుబంధం…
ఇక నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మి తులసిని వివాహం చేసుకున్నారు. ఆయనతో కలిసి అరడజను కి పైగా సినిమాలు నిర్మించారు ఈయన. అయితే కృష్ణతోనే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నపుడు మహేష్ బాబుతో కూడా సినిమాలు చేసారు. అలాగే కృష్ణ తనయుడు రమేష్ బాబు తో కూడా బజారు రౌడీ వంటి హిట్ సినిమా తీసాడు. అలాగే 1985 లో కాంగ్రెస్ తరపున గుడివాడ నుండి NTR పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక సూర్యనారాయణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.