Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22న ఘనంగా జరుపుకున్నారు మెగాభిమానులు. అభిమానుల కోసం స్పెషల్ గా ఇంద్ర సినిమాని రీ రిలీజ్ చేయగా, ఇక తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చిరంజీవి అభిమానులు (Megafans) ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో, రక్తదానాలు, అన్నదానాలతో చిరుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఈశ్వరయ్య అనే మెగాభిమాని, చిరంజీవి కోసం అలిపిరి మెట్ల నుండి తిరుమలకు పొర్లు దండాలు పెట్టుకుంటూ అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక తన పుట్టినరోజు చిరంజీవి తిరుమలలో వేంకటేశ్వరస్వామి సుప్రభాత సేవలో పాల్గొనడం జరిగింది. అక్కడ తన అభిమాని ఈశ్వరయ్యని కలవలేకపోయిన చిరంజీవి తాజాగా తన ఇంటికి పిలిపించుకుని మరీ సత్కరించడం జరిగింది.
ఈశ్వరయ్య కుటుంబాన్ని సత్కరించిన చిరు..
ఆగష్టు 22న చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా చిరు అభిమాని ఈశ్వరయ్య తిరుపతి నుంచి తిరుమల కొండకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన అభిమానాన్ని చాటుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలియగానే చిరంజీవి స్వయంగా ఈశ్వరయ్య, అలాగే ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్ లో తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి పట్టు బట్టలు పెట్టి ఘనంగా సత్కరించటం జరిగింది. దాంతో పాటు ఈశ్వరయ్య కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మెగాస్టార్ చిరంజీవి హామీనిచ్చారు.
అయ్యప్ప మాలాధారణలో చిరంజీవి..
ఇదిలా ఉండగా ఈరోజు అనగా సోమవారం రోజున చిరంజీవి అయ్యప్ప మాలను ధరించారు. ప్రతీ ఏడాది చిరంజీవి అయ్యప్ప మాలను ధరిస్తారని తెలిసిందే. అలాగే ఈరోజు అయ్యప్ప మల ధరించగా, మాలధారణ లోనే ఈశ్వరయ్య కుటుంబంతో ఉన్న చిరంజీవి పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సాధారణంగా చిరంజీవి తన హార్డ్ కోర్ అభిమానులకు ఎప్పుడూ అండగా నిలుస్తూ ఉంటాడు. అయితే చాలా సందర్భాల్లో ఇది నిరూపితం అయ్యింది. ఇక ఇప్పుడు ఈశ్వరయ్యని చిరు సత్కరించడంతో ఆయన అభిమానులను ఎంతలా గౌరవిస్తారో తెలుస్తుంది. అయితే గతంలోనూ ఈశ్వరయ్య తిరుపతి నుంచి చిరంజీవి ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు. అలాగే పవన్ కళ్యాణ్ (Pawan kalyan) పుట్టినరోజుకు, అలాగే మొన్నా మధ్య జనసేన పార్టీ నెగ్గాలని కూడా, ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేయటం జరిగింది. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.