Rimi Sen : లగ్జరీ కార్లను కొనడం అనేది చాలామంది నటీనటుల డ్రీం అనే చెప్పాలి. ఇక అలాంటివి కొనలేని వారు తమ అభిమాన నటీనటులు కొన్నప్పుడు చూసి వాళ్ళే కొన్నంత సంతోషంగా ఫీల్ అవుతారు. అందుకే హీరో లేదా హీరోయిన్లు కొనే కాస్ట్లీ కార్లకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతాయి. కానీ తాజాగా మనం చెప్పుకునే వార్త మాత్రం చాలా డిఫరెంట్. ఓ హీరోయిన్ ఏకంగా ల్యాండ్ రోవర్ అనే లగ్జరీ కార్ల తయారీ సంస్థపై కేసు వేసి వార్తల్లో నిలిచింది.
వివాదం ఏంటంటే?
బాలీవుడ్ నటి రిమీ సేన్ తన కారులో ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా 50 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కోరుతూ వాహన తయారీ సంస్థ ల్యాండ్ రోవర్పై న్యాయ పోరాటానికి దిగింది. రిమీ సేన్ 2020లో రూ. 92 లక్షలతో ల్యాండ్ రోవర్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం మరమ్మత్తు సమస్యలకు సంబంధించి కార్ కంపెనీ తనను మానసిక వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. జనవరి 2023 వరకు వారంటీతో ఆథోరైజ్డ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ డీలర్షిప్ నుండి కారును కొనుక్కుంది హీరోయిన్. అయితే COVID-19 మహమ్మారి, తదుపరి లాక్డౌన్ల కారణంగా తాను కొన్న కారును హీరోయిన్ రిమీ ఎక్కువగా ఉపయోగించ లేకపోయింది. అంటే లాక్ డౌన్ ఎత్తేసే వరకు కారును ఉపయోగించలేదు. ఆ తరువాత రిమీ సేన్ కారును ఉపయోగించడం ప్రారంభించినప్పుడు అందులోని సౌండ్ సిస్టమ్, సన్రూఫ్, వెనుక కెమెరాలో లోపాలు ఉన్నట్టు గుర్తించింది.
2022 ఆగస్ట్ 25 కారు వెనుక కెమెరా పని చేయకపోవడం వల్ల తన కారు పిల్లర్ను ఢీకొట్టిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమస్యలకు సంబంధించి డీలర్లను సంప్రదించినప్పటికీ, తన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, సాక్ష్యాధారాల కోసం రిక్వెస్ట్ చేస్తూ తన ఆందోళనలు పట్టించుకోలేదని రిమీ సేన్ కంప్లయింట్ లో పేర్కొంది. అంతేకాకుండా ఒక సమస్యకు మరమ్మత్తు చేయించిన కొంతకాలానికే మరో సమస్య మొదలయ్యేదని, కారు తయారీ సంస్థ అండ్ డీలర్ అందించిన సర్వీస్ సరిగ్గా లేదని, అలాగే తనకు డెఫెక్టివ్ కారును అంటగట్టారని ఆమె దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.
పదుల సంఖ్యలో రిపేర్లు
పదిసార్లు కారును రిపేర్ కోసం తీసుకెళ్లాల్సి వచ్చిందని, అయినప్పటికీ సమస్యలను చూపిస్తూనే ఉందని హీరోయిన్ సదరు లగ్జరీ కారుతో పడిన పాట్లను వివరించింది. దీనివల్ల తాను మానసిక వేదనను అనుభవించానని, తనకు తీవ్రంగా అసౌకర్యాన్ని కలిగించిందని ఆవేదనను వ్యక్తం చేసింది రిమీ.
50 కోట్ల దావా
తాను కారు వల్ల అనుభవించిన బాధకు పర్యవసానంగా ల్యాండ్ రోవర్ సంస్థ నుంచి రూ. 50 కోట్లు పరిహారం మాత్రమే కాకుండా తన లీగల్ ఫీజులను కవర్ చేయడానికి రూ. 10 లక్షలను కూడా రిక్వెస్ట్ చేస్తూ దావా వేసింది. అంతేకాకుండా తనకు అంటగట్టిన డిఫెక్టివ్ కారును కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. మరి ఈ వివాదంపై కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుంది? ల్యాండ్ రోవర్ సంస్థ ఎలా స్పందిస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.