Tollywood : టాలీవుడ్ మూవీ లవర్స్ సినిమాలకు ఎంతగా అడిక్ట్ అయ్యారంటే టైమ్, సీజన్ తో సంబంధం లేకుండా థియేటర్లకు క్యూ కట్టేంత. అయితే బాక్స్ ఆఫీసు సందడి ఏడాది మొత్తం ఒకేలా ఉండదు. దీనికి రీజన్ సినిమాల పర్ఫార్మెన్స్ ఒకటైతే, మేకర్స్ కు ఉండే సెంటిమెంట్ మరో కారణం. ఐపీఎల్ సీజన్లో సినిమాలు లేక థియేటర్ల ఓనర్లు ఎలా ఈగలు తోలుకున్నారో మనం చూసాము. దానికి కారణం ఐపీఎల్ ఫీవర్లో ఉండే ప్రజలు ఆ టైమ్లో థియేటర్ల వైపు చూడరు. ఇక మరోవైపు రీజన్ ఏమీ లేకపోయినా సినీ పరిశ్రమకు, మేకర్స్ కు కలిసిరాని సీజన్లు కూడా ఉంటాయి ఈ ఏడాది ఆగష్టులాగా. గడిచినపోయిన ఆ నెల టాలీవుడ్ కు ఒక నైట్ మేర్ లా మారింది.
టాలీవుడ్ కు పీడకలగా మారిన ఆగష్టు
టాలీవుడ్లో అసాధారణమైన వ్యాపారాలు జరిగే పండుగల సీజన్ల మాదిరిగానే, కొన్ని నెలలు డిజాస్టర్ టైమ్ నడుస్తుంది. ఆగస్టు నెల రెండవ వర్గంలోకి వస్తుంది. లాక్డౌన్ తర్వాత ఆగస్ట్లో వస్తున్న సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావడం లేదు. గతంలోకి తొంగిచూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. 2022కి వెళితే పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ ‘లైగర్’ రూపంలో తమ కెరీర్లోనే కనీవినీ ఎరుగని డిజాస్టర్ను అందుకున్నారు. ఈ పాన్-ఇండియన్ సినిమా విజయ్ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని అనుకున్నారు. కానీ అది అతడిని పతనానికి గురి చేసింది. కొనుగోలుదారులు భారీ నష్టాలను చవిచూశారు. విజయ్, పూరీల ఫ్యాన్స్ ఈ పీడకల నుండి ఇంకా కోలుకోలేదు.
ఇక 2023లో మెగాస్టార్ చిరంజీవి ‘భోలా శంకర్’ అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అలరించే ప్రయత్నం చేయగా, అది దారుణమైన రిజల్ట్ ఇచ్చి బెడిసికొట్టింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ డ్రామా భారీ ఫ్లాప్ అయ్యింది. ఇది 2015లో వచ్చిన తమిళ మూవీ ‘వేదాళం’కి రీమేక్. ఈ మూవీ వల్ల భారీ నష్టాలు రావడమే కాదు చిరంజీవి ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింది. మెగాస్టార్ ఏకంగా ఈ మూవీ రిజల్ట్ తో తన విధానాన్ని పూర్తిగా మార్చుకోవలసి వచ్చింది. ‘భోలా శంకర్’ తర్వాత ఆయన నటించిన మరో సినిమా ఇప్పటిదాకా విడుదల కాలేదు. గతేడాది ఆగస్టులో వచ్చిన ‘గాండీవధారి అర్జున’ కూడా పరాజయం పాలైంది. వరుణ్ తేజ్ కెరీర్లో అత్యల్ప వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఎన్నో ఆశలతో వచ్చిన ఆగస్టు కూడా టాలీవుడ్ కు మళ్లీ అదే రిజల్ట్ ను ఇచ్చింది. ఈ నెలలో పోటాపోటీగా రిలీజ్ అయిన ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి మాస్ సినిమాలు నిరాశనే మిగిల్చాయి.
ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న ఆగష్టు
‘మిస్టర్ బచ్చన్’తో రవితేజ ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింది. అలాగే ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా. ఈ మూవీ రిజల్ట్ చూశాక పూరీ జగన్నాధ్ మరో సినిమా చేయకపోవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. కనీసం 2025 నుంచైనా ఈ ట్రెండ్ ను ఏ హీరో మారుస్తాడో చూడాలి.