Biopic of Chief Election commissioner : ప్రస్తుతం నడుస్తున్న ఎలక్షన్స్ వేడిలో మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. భారతదేశపు మొట్టమొదటి ఎలక్షన్ కమీషనర్ సుకుమార్ సేన్ బయోపిక్ కు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మేరకు తాజాగా అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. మరి సుకుమార్ బయోపిక్ ను ఎవరు తెరకెక్కించబోతున్నారో తెలుసుకుందాం పదండి.
సిద్ధార్థ్ రాయ్ చేతుల్లో సుకుమార్ బయోపిక్
ప్రముఖ చిత్రనిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ భారత తొలి సార్వత్రిక ఎన్నికల రూపశిల్పి, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సుకుమార్ సేన్పై బయోపిక్ తీయబోతున్నారు. సుకుమార్ సేన్ జీవితంపై నిర్మించే ఈ సినిమా హక్కులను రాయ్ కపూర్ ఫిల్మ్స్ కొనుగోలు చేసింది. సిద్ధార్థ్ రాయ్ కపూర్ తన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘రాయ్ కపూర్ ఫిల్మ్స్’ బ్యానర్పై భారతదేశపు మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్పై బయోపిక్ను రూపొందించబోతున్నారు. రాయ్ కపూర్ ఫిల్మ్స్ తాజాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘గత నెలలో మీరు ఎవరికి ఓటు వేసినా ఫర్వాలేదు. అసలు కథ, చిహ్నం మీ చూపుడు వేలుపై ఉన్న చిన్న నల్లని గీత. మీరు మిస్ అవ్వడానికి ఇష్టపడని ఒక అద్భుతమైన కథనాన్ని మేము మీ కోసం అందిస్తున్నాము’ అంటూ సుకుమార్ బయోపిక్ ను తెరపైకి తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు.
మొట్టమొదటి ఎలెక్షన్ కమిషనర్ ఆయనే
పశ్చిమ బెంగాల్కు చెందిన సుకుమార్ ఆజాద్ భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 మార్చి 26న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.
రాయ్ కపూర్ మాటల్లో..
సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఈ బయోపిక్ గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ ‘మన జాతీయ హీరోలలో ఒకరైన సుకుమార్ సేన్ అద్భుతమైన కథను మేము పెద్ద తెరపైకి తీసుకురాబోతున్నాము. ఇది నాకు గర్వకారణమైన క్షణం. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రను రూపొందించడంలో సుకుమార్ సేన్ కీలక పాత్ర పోషించారు. వివిధ చిహ్నాలు, రంగుల ఆధారంగా రాజకీయ పార్టీలను గుర్తించే విధానాన్ని ఆయన తీసుకొచ్చారు. అదే సమయంలో అతను నిరక్షరాస్యతను అధిగమించడానికి ఓటర్లకు అధికారం ఇచ్చాడు. ఓటు వేసిన తర్వాత గోళ్లపై చెరగని సిరాను పూయాలనే ఆలోచన కూడా అతనిదే. అతను ఇప్పుడు మన మధ్య లేరు. కానీ ఆయన అనేక ఆవిష్కరణలు నేటికీ ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు.
సుకుమార్ సేన్ కుటుంబం రియాక్షన్
సుకుమార్ సేన్ జీవిత చరిత్రపై ఈ సినిమా రూపొందడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అతని మనవడు సంజీవ్ సేన్ మాట్లాడుతూ ‘ఒక దేశంగా భారతదేశం సాధించిన గొప్ప విజయాలలో ప్రజాస్వామ్యం ఒకటి. అన్ని ప్రజాస్వామ్యాలకు పునాది స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలే. ఈ చురుకైన ఎన్నికల ప్రక్రియకు పునాది రాయి వేసిన ఘనత సుకుమార్ సేన్కే చెందుతుంది. మా తాత స్వతంత్ర భారతదేశపు మొదటి CEC. మేము అతనిని చూసి గర్విస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చారు.