సినిమా ఇండస్ట్రీ అనే గ్లామర్ ప్రపంచంలో ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో చెప్పడం అసాధ్యం. అయితే కొంతమంది అదృష్టం వరించి సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి రాజకీయాలలోకి అడుగుపెడితే మరికొంతమంది ఇండస్ట్రీలో సక్సెస్ కాలేక రాజకీయాలలోకి అడుగుపెట్టిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది సినీ ఇండస్ట్రీలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. భారీ విజయాలను సొంతం చేసుకొని నటులుగా ఉన్నత పొజిషన్ కి చేరుకొని.. ఆ తర్వాత రాజకీయాలలోకి అడుగుపెడుతూ ఉంటారు.. ప్రత్యేకించి గత కాలంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయాల వైపు అడుగులు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు..
అందులో భాగంగానే ప్రత్యేకించి ఈ 2024 ఎన్నికలలో సామాన్య రాజకీయ నాయకులే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా రాజకీయాలలోకి అడుగుపెట్టి పలు నియోజకవర్గాలలో పోటీ చేసి.. కొంతమంది గెలిస్తే మరి కొంతమంది ఓటమి పాలు చూసారు. మరి ఈసారి మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల పోటీలో ఎవరెవరు సెలబ్రిటీలు.. ? ఎక్కడి నుంచి పోటీ చేశారు ? వారి ఫలితాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన.. మొదట తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.. అయితే చిరంజీవి 2011లో ఆ పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేయడంతో.. పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పేరుతో పార్టీ స్థాపించారు.. 2014లోనే పార్టీ పెట్టినా… 2019 ఎన్నికలలో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందారు.. కానీ 2024 ఎన్నికల్లో భాగంగా కూటమి తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏకంగా 70 వేల ఓట్ల మెజారిటీతో అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు కూటమిలో భాగంగా జనసేన పార్టీకి 21 స్థానాలు కేటాయించగా.. అన్ని స్థానాలలో 100% మెజారిటీ సాధించి చరిత్ర రికార్డు తిరగరాశారు పవన్ కళ్యాణ్.
బాలకృష్ణ:
2014 నుండి ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొంటున్న బాలకృష్ణ అదే ఏడాది హిందూపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఆ తర్వాత 2019లో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ.. 2024లో కూడా హిందూపురం నియోజకవర్గం నుండి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇటు రాజకీయాలలో హ్యాట్రిక్ కొడుతూ.. అటు సినిమాలలో కూడా హ్యాట్రిక్ కొడుతూ సక్సెస్ఫుల్గా కెరియర్ లో దూసుకుపోతున్నారు బాలయ్య.
రాధికా శరత్ కుమార్:
ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్.. తమిళనాడు విరుధ్ నగర్ నుంచి బిజెపి తరఫున పోటీ చేసి.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్యం ఠాగూర్ చేతిలో ఓడిపోయారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈమె గెలవాలి అని.. బిజెపి అధికారంలోకి రావాలని ఈమె భర్త .. ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ విరుద్ నగర్ లో ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణ లతో పాటు పొర్లు దండాలు కూడా పెట్టారు .. ఆయన కష్టం ఫలిస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ ఊహించని విధంగా ఆమె మూడవ స్థానంతో సరిపెట్టుకోవడం నిజంగా ఆశ్చర్యకరం. అయితే ఈసారి ఆయన కోరుకున్నట్టు బిజెపి మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పవచ్చు.
నవనీత్ ఠాణా:
ప్రముఖ హీరోయిన్ నవనీత్ ఠాణా… ప్రత్యక్ష రాజకీయాలలో చాలా వేగంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. తెలుగులో పలు చిత్రాలలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ .. వరుసగా రెండోసారి అమరావతి మహారాష్ట్ర నుంచి తలపడ్డారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ బసవంత్ వాంఖడే చేతిలో 19వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు..
కంగనా రనౌథ్:
హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నియోజకవర్గం నుండి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌథ్.. బిజెపి తరఫున పోటీ చేసి అరంగేట్రంలోనే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ పై ఏకంగా 74 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది. ఏదిఏమైనా బాలీవుడ్ లేడీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇలా రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలోనే ఏకంగా భారీ మెజారిటీతో గెలుపొందడం అంటే నిజంగా ఆశ్చర్యకరమైన సంఘటనని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందిరాగాంధీ బయోపిక్ లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఒకవైపు హీరోయిన్ గా మరొకవైపు ఎంపీగా ఎలా తన బాధ్యతలను నిర్వహిస్తుందో చూడాలి.
హేమమాలిని:
కలల రాకుమారిని హేమమాలిని కూడా యూపీలోనే మధురా నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించింది.కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ దంగర్ పై 2.93 లక్షల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇటు ప్రజా సేవా కార్యక్రమాలతో కూడా ప్రజల మన్ననలు పొందుతోంది.
స్మృతి ఇరానీ:
టీవీ నటిగా, మోడల్ గా కెరియర్ ప్రారంభించిన స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈసారి ఈమెకు గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. యూపీలోని అమేటీ నుంచి తన ప్రత్యర్థి కిషోర్ లాల్ శర్మ చేతిలో 1.62 లక్షల తేడాతో ఓటమి చవిచూశారు.
రవి కిషన్ – కాజల్ నిషాధ్:
రేసుగుర్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న రవికిషన్.. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ నుంచి పోటీ చేసిన ఈయన తన సమీప అభ్యర్థి భోజ్ పురీ నటి కాజల్ నిషాద్ పై లక్ష ఓట్ల తేడాతో గెలిచారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవి కిషన్ ఇప్పుడు రాజకీయాలలో కూడా అత్యంత వేగంగా దూసుకుపోతున్నారనటంలో సందేహం లేదు.
రచన – లాకెట్ ఛటర్జీ :
ప్రముఖ సినీ నటి రచన పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నుంచి మరో ప్రముఖ నటి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ పై 76000 ఓట్ల ఆదిత్యంతో జయకేతనం ఎగరవేశారు.
దీపక్ అధికారి – హిరణ్మై ఛటోపాధ్యాయ – :
బెంగాల్ లోని ఘటల్ నుంచి తృణమూల్ సిట్టింగ్ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్ అధికారి అలియాస్ దేవ్.. తన సమీప బీజేపీ అభ్యర్థి సినీ నటుడు హిరణ్మై ఛటోపాధ్యాయను 1.82 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు.
మనోజ్ తివారీ :
నార్త్ , ఈస్ట్ ఢిల్లీ నుంచి భోజపురీ నటుడు మనోజ్ తివారి బిజెపి అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేశారు. తాజా ఫలితాల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ పై 1.37 లక్షల ఆధిక్యంతో విజయం సాధించారు.
మలయాళ నటుడు కృష్ణ కుమార్ – ఎం ముఖేష్ :
ప్రముఖ మలయాళ నటుడు కృష్ణకుమార్ కేరళలోని కొల్లం లోని బిజెపి నుంచి.. మరో సినీ నటుడు ఎం ముఖేష్ సీపీఎం నుంచి పోటీ చేయగా వీరిద్దరూ కూడా గెలవలేదు..
తంగర్ బచన్:
ప్రముఖ సినీ నటుడు , దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ తంగర్ బచన్ తమిళనాడులోని కడలూరు నుంచి బిజెపి మిత్రపక్షం పిఎంకె తరఫున పోటీ చేయగా విజయం వరించలేదు..
శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్..
కర్ణాటకలోని శివమొగ్గ నుంచి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి యడ్డూరప్ప కుమారుడు బివై రాఘవేంద్ర చేతిలో ఓడిపోయారు. నిజానికి కన్నడ సినిమా ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు తెలుగులో , తమిళ్ లో కూడా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. దీంతో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తూ.. ఎన్నికల్లో భాగంగా తన భార్య గీత శివ రాజ్ కుమార్ను బరిలోకి దింపారు. కానీ ఆమె ఘోర పరాభవాన్ని చవిచూశారు.
సురేష్ గోపి:
ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి కేరళలోని త్రిసూర్ లోక్సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
అరుణ్ గోవిల్:
రామానంద్ సాగర్ రామాయణంలో రాముడి పాత్రకు ప్రసిద్ధి చెందిన అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
శత్రుఘ్న సిన్హా :
పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ స్థానానికి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకొని తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శత్రుఘ్న సిన్హా ఇప్పుడు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో వెండితెర నుంచి రాజకీయ రంగనానికి ఆయన మారడం వెనుక ఆయన చేసిన ప్రజాసేవే ప్రధమంగా కనిపిస్తోంది. నిబద్దతతో కూడుకున్న ఆయన క్రమశిక్షణ ఇప్పుడు రాజకీయంలో ముందుకు దూసుకు వెళ్లేలా చేస్తోందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈయన అభిమానులు సంబరాలలో మునిగితేలుతున్నారు.
జూన్ మాలియా:
ప్రముఖ బెంగాలీ నటుడు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన జూన్ మాలియా పశ్చిమబెంగాల్లోని మేదినీపూర్ లో పోటీ చేసి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రాంతీయ రాజకీయాలలో ఒక శక్తిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు.
సతాబ్ది రాయ్:
బెంగాలీ నటుడు తృణమూల్ ఎంపీ అయిన సతాబ్ది రాయ్ మూడుసార్లు ఎంపీగా గెలిచిన విషయం తెలిసింది. బీర్భూమ్ లో ఏకంగా 11 మంది పోటీ దారులను ఓడించి తన సీటును నిలబెట్టుకొని ప్రజల నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు.
దేశవ్యాప్తంగా నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలలో చాలామంది సెలబ్రిటీలు పోటీకి దిగిన విషయం తెలిసిందే.అందులో ఎమ్మెల్యే , ఎంపీ స్థానాలకు పోటీ చేసి కొంతమంది భారీ విజయాన్ని అందుకుంటే మరికొంతమంది అత్యంత దారుణంగా ఓడిపోయారు.