Shavukaru Janaki : చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయడం, ఒక హీరోయిన్ చేయాల్సిన పాత్ర మిస్ అయి మరో హీరోయిన్ చేతికి వెళ్లడం చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు ఆయా పాత్రలకు కుదరక, లేక దర్శక నిర్మాతల వేరే అభిప్రాయం వల్ల, చాలా సార్లు డేట్లు అడ్జస్ట్ కాక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ సమస్య ఈరోజుల్లేనే కాదు, బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల నుండి ఉంది. మామూలుగా మొదట అనుకున్న హీరోయిన్ మాత్రం ఎప్పడూ బెస్ట్ ఛాయిస్. ఏ దర్శకుడైనా ఆ పాత్రకు ఫలానా హీరోయిన్ మాత్రమే పర్పెక్ట్ గా సూటువుతుందని ఓ ఊహ ఉంటుంది. వీలైనంత వరకూ వాళ్లకే మొదటి ప్రాధాన్యత కూడా ఇస్తారు. వాళ్లు కుదరని పక్షంలోనే మరో హీరోయిన్ కి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పాత సంఘటన ఒకటి బయటకొచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు-సావిత్రి నటించిన ‘దేవదాసు’ అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. దేవదాస్ గా అక్కినేని, పార్వతిగా సావిత్రి ఆ పాత్రల్లో జీవించారు. ఈ రెండు పాత్రలకు వాళ్లు మాత్రమే న్యాయం చేయగలరనిపించారు. మరో హీరోయిన్ గాని.. నటినిగానీ ఆ పాత్రల్లో ఊహించుకోవడమన్నదే అసాధ్యంగా అనిపిస్తుంది. అయితే ఇందులో హీరోయిన్ పాత్రకు తొలుత అనుకున్నది సావిత్రిని కాదట.
పార్వతి చేయాల్సిన షావుకారు జానకి..
అయితే దేవదాసులో పార్వతి పాత్ర ముందుగా చేయాల్సింది “షావుకారు జానకి” అట. ఈ విషయంపై షావుకారు జానకి (Shavukaru Janaki) నే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ విషయం కూడా చిత్ర పరిశ్రమలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘దేవదాసు షూటింగ్ ప్రారంభ కాలంలో నిర్మాత డి.ఎల్ నారాయణ , రచయిత సముద్రాల మా ఇంటికొచ్చారు. పాత్ర గురించి చెప్పి, నన్ను పార్వతి పాత్ర పోషించమన్నారు. నాగేశ్వరరావు గారు దేవదాస్ రోల్ అని, మిగిలిన పాత్రలు ఎవరు? అన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. దానికి షావుకారు జానకి తాను సంతోషించానని, గొప్ప పాత్ర దక్కిందని సంబరపడ్డానని, వారికి థాంక్స్ కూడా చెప్పానని చెప్పుకొచ్చింది. అంతే కాదు ‘ఓ దేవదా’ పాట రికార్డు అయితే ఆ పాటను టేపులో పంపితే, విని రోజూ సాధన చేయడం ప్రారంభించారట. షూటింగ్ తేదీలు కూడా ఖరారు చేసారు.
ఆ పాత్ర మిస్ అయినందుకు బాధపడ్డ జానకి..
అయితే ఒకరోజు ఒకాయన జానకి ఇంటికొచ్చి ఆ సినిమాకి తాను పైనాన్స్ చేస్తున్నాను. దేవదాసులో పార్వతి మీరు కాదు. ఆ పాత్ర మరొకరు చేస్తున్నారని చెప్పి టేప్ రికార్డర్ పట్టుకుపోయారు. దాంతో తాను చాలా బాధపడ్డానని, కళ్లంట నీళ్లు తిరిగాయ్ అని షావుకారు జానకి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆ పాత్ర సావిత్రి చేస్తున్నట్లు తెలిసిందని, సినిమా చూసాక ఓ గొప్ప నటి పార్వతి పాత్రలో అద్భుతంగా నటించిందని, సావిత్రిని మనసారా కౌగిలించుకుని అభినందించానని షావుకారు జానకి అన్నారు. ఇక అలనాటి నటి షావుకారు జానకి ఇప్పటికి పలు సినిమాల్లో కనిపిస్తూనే ఉంటుంది.