Yamini Krishnamurthy passes away : భారత దేశం గర్వించదగ్గ లెజెండరీ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి (84) ఈరోజు అనారోగ్య సమస్యలతో కాసేపటికింద కన్నుమూశారు. ఢిల్లీ లో అపోలో హాస్పిటల్ లో కొద్దిసేపటి క్రితమే ఈమె మరణవార్తని డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఈతరం వారికి యామిని కృష్ణమూర్తి అంటే ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ భారత దేశం గర్వించదగ్గ లెజెండరీ నృత్యకారిణి ఈమె. ముఖ్యంగా తెలుగువారికి అత్యంత గర్వకారణం. భరతనాట్యం, కూచిపూడి కళాకారిణి అయిన యామినీ కృష్ణమూర్తి, ఒడిస్సీ, కథక్ వంటి నృత్యాలలో కూడా ఎంతో నిష్ణాతురాలు. ఆంధ్ర ప్రదేశ్ లో చిత్తూరు జిల్లా, మదనపల్లె ఊరు నుండి వచ్చిన యామిని కృష్ణ మూర్తి దేశ విశేషాల్లో కూచిపూడి, భారతనాట్యం నృత్యాలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు.
చిన్న తనం నుండే భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సాధించిన యామినీ కృష్ణమూర్తి, 1957లో ఆమె తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆనాటి నుండి తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇటు భారతీయ సంస్కృతిని చాటి చెప్పి మన దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచారు. ఇక యామిని కృష్ణమూరి చేసిన కళాసేవకు భారత ప్రభుత్వం పద్మశ్రీ (1968), పద్మ భూషణ్ (2001) పద్మ విభూషణ్ (2016) పురస్కారాలతో సత్కరించింది.
ఇక యామినీ కృష్ణమూర్తి పూర్తి పేరు యామినీ పూర్ణ తిలకం. తన తండ్రి ప్రోత్సాహంతో చిన్న వయసులోనే భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన ఈమె కర్ణాటక సంగీతం లోనూ సిద్ధహస్తులయ్యారు. ఇక యామిని కృష్ణమూర్తి తన ఇరవై ఏటా నుండే అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్ వంటి దేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలిచ్చారు. ఇక యామిని కృష్ణమూర్తి టీటీడీ ఆస్థాన నర్తకిగా కొన్నేళ్ల పాటు తిరుమల శ్రీవారికి సేవలందించారు. ఢిల్లీ లో “నృత్య కౌస్తుభ కల్చరల్ సోసైటీ యామిని స్కూల్ ఆఫ్ డాన్స్” పేరుతో ఒక డాన్స్ సంస్థను ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇచ్చేవారు. ఇక యామిని కృష్ణమూర్తి మరణ వార్తతో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.