యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ సాధించి పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు. గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో మరోసారి నటవిశ్వరూపం చూపించారు.
ఈ చిత్రం తరువాత తాజాగా కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఇటీవలే ఆచార్య సినిమాతో కాస్త నిరాశ పరిచాడు కొరటాల. అయితే ఆ సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుందా లేదా అని ఎన్టీఆర్ అభిమానులు తర్జనభర్జన పడుతున్నారు. దర్శకుడు కొరటాల మాత్రం ఈసారి సూపర్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. పవర్పుల్ డైలాగ్తో ఈ మోషన్ పోస్టర్ని డిజైన్ చేశారు. ఆ తరువాత ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటికి రాకపోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కొరటాలపై కాస్త గరంగా ఉన్నారు. దసరా పండుగ సందర్భంగా ఎన్టీఆర్ సినిమాకి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ కొరటాల టీమ్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో తారక్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మరోవైపు అక్టోబర్ 10న ఏదో అప్డేట్ ఉంటుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ అభిమానుల కోరిక మేరకు ఇప్పటికైనా ఏదైనా అప్డేట్ వస్తుందేమో వేచి చూడాలి.