ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 2 సినిమా గత కొద్ది నెలలుగా షూటింగ్ ప్రారంభమవుతుందని అనుకుంటున్నారే తప్ప ఆ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు తాజాగా రామోజీ ఫిలింసిటీలో పుష్ప 2 షూటింగ్ ప్రారంభం అయినట్టు తెలుస్తోంది.
స్క్రిప్ట్ మొత్తాన్ని సిద్ధం చేసిన సుకుమార్ ఇటీవలే పుష్ప మొదటి భాగం కంటే పుష్ప 2లోనే ముఖ్యమైన కథాంశం ఉందని చెప్పారు. ఎట్టకేలకు ఇవాళ రామోజీ ఫిలింసిటీలో వేసిన స్పెషల్ సెట్ లో సుకుమార్ షూట్ స్టార్ట్ చేశాడట. ఈ షూట్ లో అల్లు అర్జున్ లేరని తెలుస్తోంది.
నవంబర్ చివరి వారంలో షూటింగ్లో అల్లు అర్జున్ పాల్గొనన్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, ధనుంజయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక వివాహా వేడుక కోసం దక్షణాఫ్రికాకు వెళ్లారు.