నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే నటుల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె ఇన్స్టా, ట్విటర్లలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటూ అభిమానులతో పలు విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తెలుగు సినిమాలు, పెళ్లి వార్తలపై స్పందించారు.
ముఖ్యంగా టాలీవుడ్లో ధృవ, సరైనోడు, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఢిల్లీ బామ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలను చేస్తోంది. గత కొంతకాలంగా ఈమె టాలీవుడ్ చిత్రాలకు దూరమైంది. వైష్ణవ్ తేజ్ నటించిన కొండ పొలం సినిమా తరువాత తెలుగు సినిమాల్లోనే నటించలేదు. తెలుగు సినిమాల్లో ఎందుకు నటించలేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై రకుల్ తాజాగా స్పందించారు.
‘త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమాల్లో నటిస్తాను. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దీనికి కారణం టాలీవుడ్ ఇండస్టీ’ అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. మరోవైపు బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో రకుల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరు త్వరలో పెళ్లి చేసుకోనున్నారని రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ చెప్పినట్టు ఓ ఆంగ్ల పత్రికలో ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ విషయంపై రకుల్ స్పందిస్తూ.. ‘నా పెళ్లి గురించి నువ్వు నిజంగానే స్పష్టతనిచ్చావా..? నా పెళ్లి గురించి నాకు కూడా చెప్పాలి కదా బ్రో.. నా జీవితం గురించి నాకే తెలియకపోవడం హాస్యస్పదంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం రకుల్ డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, ఛత్రివాలి, ఇండియన్ 2 వంటి సినిమాలు చేస్తున్నారు. రకుల్నటించిన డాక్టర్ జీ ఈనెల 14న విడుదల కానుంది.