RGV : వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడా ?

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసినా అది సంచ‌ల‌నం అవుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌ల ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో కూడా భేటీ అయిన విష‌యం విధిత‌మే.  ఈ భేటీ తో సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల ప్ర‌కారం.. జ‌గ‌న్ బ‌యోపిక్ ను రామ్‌గోపాల్ వ‌ర్మ తీయ‌బోతునున్నారట. ఈ చిత్రానికి ‘జ‌గ‌న్నాథ ర‌థ చ‌క్రాలు’ టైటిల్ ని కూడా ఫిక్స్ చేశార‌ని గుస గుసలు వినిపించాయి.

ఈ రూమ‌ర్స్ అన్నింటికి రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. తాను తీయ‌బోయే సినిమా గురించి పూర్తిగా వివ‌రించాడు. “అహంకారానికి, ఆశ‌యానికి మ‌ధ్య జ‌రిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కథ‌ రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికష్టే “వ్యూహం” చిత్రం”.

ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. మొద‌టి పార్ట్ వ్యూహం, రెండో పార్ట్ ‘శ‌ప‌థం’ రెండింటిలోను రాజ‌కీయ అరాచ‌కీయాలు పుష్క‌లంగా ఉంటాయి. రాష్ట్ర ప్ర‌జ‌లు మొద‌టి చిత్రం వ్యూహం షాక్ నుంచి తేరుకునే లోపు వాళ్ల‌కి ఇంకో ఎల‌క్ట్రిక్ షాక్ పార్ట్ 2 శ‌ప‌థంలో త‌గులుతుంది. ఎన్నిక‌ల‌ను టార్గెట్ గా ఈ సినిమా తీయ‌డం లేద‌ని ఎవ్వ‌రు న‌మ్మ‌రు. ఏం చెప్పాలో, ఏం చెప్ప‌కూడ‌దో చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని మీకు వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు క‌నుక చెప్ప‌డం లేదు అని రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ చేయ‌డం విశేషం.

- Advertisement -

కాగా ఈ బయోపిక్ కు నిర్మాతగా దాసరి కిరణ్ వ్యవహరించబోతున్నారు. దాసరి కిరణ్-వర్మ కాంబినేషన్ లో ఇప్పటికే వంగవీటి అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇదీలా ఉండగా బ‌యోపిక్‌లు తీయ‌డం రామ్ గోపాల్ వ‌ర్మ‌కి కొత్త ఏం కాదు. గ‌తంలో వంగ‌వీటి, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ వంటి బ‌యోపిక్‌లు తెర‌కెక్కించారు. అయితే ఇప్పుడు బ‌యోపిక్‌లు వ‌ర్మ చేతికి ఇస్తే అది ఆశించిన మేర‌కు ఆక‌ట్టుకోద‌నే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తుంది. అయిన‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ చేతికి సినిమాను  ఏపీ సీఎం జ‌గ‌న్ ఎందుకు ఇచ్చాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యూహం సినిమాను వ్యూహాత్మకంగా తెరకెక్కిస్తాడా ? లేక.. ఎప్పటి లాగే ప్లాప్ ముటగట్టుకుని, జగన్ ను నిరాశపరుస్తాడా ? అనేది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు